నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
23 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 84 పరీక్షా కేంద్రాల ఏర్పాటు 4 ఫ్లయింగ్, 10 సిట్టింగ్ స్క్వాడ్లు సీసీ కెమెరాలతో నిఘా పరీక్షలు రాయనున్న విద్యార్థులు 61,015 మంది ఆర్ఐఓ జి.రాజశేఖర్రెడ్డి వెల్లడి
తిరుపతి సిటీ : ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ఆర్ఐఓ జి రాజశేఖర్రెడ్డి తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అర్దగంట ముందే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 84 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 30,319 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 30,696 మంది పరీక్షలకు హాజరుకానున్నారని తెలియజేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవకతవకలకు వీలులేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 4 ఫ్లయింగ్, 10 సిట్టింగ్ స్కాడ్లు ఏర్పాటు చేశామని, లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయనున్నట్టు వివరించారు. సమస్యాత్మక కేంద్రాల్లో మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. మాల్ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేస్తామన్నారు. విద్యార్థులు నేరుగా వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రాలకు హాజరుకావచ్చని తెలిపారు. కళాశాలతో ఎటువంటి సంబంధం ఉండదని తెలిపారు. పరీక్షల సమయంలో ప్రైవేటు కళాశాలలు విద్యార్థులకు అసౌకర్యం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అన్ని పరీక్షా కేంద్రాలకు రవాణా సౌకర్యం కల్పించినట్టు తెలిపారు.


