
బినామీల కోసమే ప్రైవేటీకరణ
వెంకటగిరి (సైదాపురం) : ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు తగ్గరలోనే ఉన్నాయని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవనంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ ఆంధ్ర రాష్ట్ర పేద బతుకులకు తలరాతలని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య, పేదలకు వైద్యం అందేలా గత ప్రభుత్వం మెడికల్ కళాశాలను నిర్మించారన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పగించేందుకు కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించిన వారు దేశంలో ఇంకెవరూ లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ పాలనతో అరాచకాలు పెరిగిపోతున్నాయని వాటికి పదింతలు బుద్ధి చెప్పే విధంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జగన్ 2.0 డిజిటల్ బుక్ను ప్రవేశ పెట్టారన్నారు. తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని వదలిపెట్టే ప్రసక్తేలేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలను కూటమి సర్కార్ మోసం చేస్తుందని తెలిపారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి అమలు చేయకుండా పీ–4 అంటూ కాలయాపన చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అనంతరం వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పార్టీతో సంబంధం లేకుండా కోటి సంతకాల కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావాలన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. దీనికి అధికారులు కూడా సమాధానం చెప్పే రోజులు తగ్గరలోనే ఉందన్నారు. తాజాగా జనసేన నేత గూడూరు వెంకటేశ్వర్లు తప్పును ఎత్తిచూపించినందుకు ఆయనపై కూడా కేసు నమోదు చేశారన్నారు. అనంతరం కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మొదటి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, స్టేట్ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ మెంబర్ బొలిగర్ల మస్తాన్యాదవ్, పాపకన్ను మధుసూదన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, మండల కన్వీనర్లు, రాష్ట్ర విభాగాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం
తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను రాజకీయ కక్షతో ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నుతోందని కూటమి ప్రభుత్వంపై ప్రజా ఉద్యమం మొదలైందని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి 26వ డివిజన్లోని బండ్లవీధిలో శుక్రవారం కార్పొరేటర్ తాజిన్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భూమన అభినయ్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే పూర్తి చేసి పేదలకు ఉచిత వైద్యం, ఉచిత వైద్య విద్య అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలను పక్కన పెట్టి కేవలం రూ. 6 వేల కోట్లను ఖర్చుపెట్టి మెడికల్ కాలేజీలను పూర్తి చేసి పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను అందించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్బ్యాంక్ చైర్మెన్ కేతం జయచంద్రారెడ్డి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, కోటూరు ఆంజినేయులు, బోకం అనిల్కుమార్, ఆదిలక్ష్మి, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బినామీల కోసమే ప్రైవేటీకరణ