
సచివాలయం నుంచి కలెక్టరేట్కు..
సమస్యల సుడిగుండంలో ప్రజలు కలెక్టరేట్ చుట్టూ తప్పని ప్రదక్షిణలు గ్రీవెన్స్కు వెల్లువెత్తుతున్న వినతులు అధికారుల అలసత్వంతో అతీగతీ లేని అర్జీలు ఆవేదన.. ఆందోళనలో బాధితులు
మాకు రెండు ఎకరాల భూమి ఉంది. మా ఊర్లోని కొందరు మా భూమిని వారి పేర్ల మీద ఆన్లైన్లో నమోదు చేయించేసుకున్నారు. దీంతో దిక్కుతో చక సచివాలయంలో ఫిర్యా దు చేశా. కొద్దిరోజులు తిప్పు కుని నెల తర్వాత తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లమన్నారు. అక్కడి సిబ్బంది ఆర్డీఓ ఆఫీస్కు వెళ్లమని సూచించారు. నాలుగు నెలలు ఈ విధంగా తిరిగి, చివరకు కలెక్టరేట్కు వచ్చి అర్జీ పెట్టుకున్నా. ఇక్కడ 75 రోజుల గడువు ఇచ్చారు. పరిష్కారం ఏం చూపుతారో తెలియడం లేదు. మాకు ఆ భూమే ఆధారం. కార్యాలయాల చుట్టూ తిరిగేందుకు ఖర్చులు పెట్టుకునే స్తోమత కూడా మాకు లేదు.
– టి.సుబ్బమ్మ, ముచ్చివోలు, శ్రీకాళహస్తి మండలం
న్యాయం చేసేలా లేరు
మా కాలనీలోని బడిని మన్నవరం గ్రామానికి మార్చారు. మా పిల్లలను అంతదూరం పంపలేని పరిస్థితి. దీంతో పాఠశాలను మార్చవద్దని సచివాలయం నుంచి ఎంఈఓ కార్యాలయం వరకు అర్జీలు పెట్టుకున్నాం. ఎవరూ పట్టించుకోలేదు. చివరకు జూన్ 30వ తేదీన కలెక్టరేట్లో వినతి పత్రం ఇచ్చా. మా అర్జీ నంబర్ టీపీటీ 202506307561 .ఇప్పటికి 90 రోజులు గడిచింది. ఆ తర్వాత రెండు సార్లు వచ్చి మళ్లీ అర్జీలు ఇచ్చాం. అతీగతీ లేదు. ఇక్కడ కూడా న్యాయం చేసేలా లేరు. – పెంచలమ్మ,
రాగిగుంట ఎస్సీ కాలనీ, శ్రీకాళహస్తి మండలం
ఆవు చేనులో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా..? అన్నట్లు తయారైంది అధికారుల వ్యవహారశైలి. పేదల ఊసే గిట్టని పాలకుల బాటనే.. జిల్లా యంత్రాంగం నడుస్తోంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఓ ప్రహసనంగా మార్చేసింది. ప్రతి సోమవారం కలెక్టరేట్లో తూతూమంత్రంగా వినతుల స్వీకరణ తంతు చేపడుతోంది. వెంటనే కష్టం తీర్చేస్తున్నామని కలరింగ్ ఇచ్చేందుకు అర్జీదారు ఫోన్కు మెసేజ్ పంపేసి చేతులుదులిపేసుకుంటోంది. ఇక అంతే వాటికి అతీగతీ ఉండదు. సమస్య తీరదు. మళ్లీ సోమవారం వస్తే అంతా మామూలే. వినతులు వస్తుంటాయ్.. ఆన్లైన్లోకి ఎక్కుతుంటాయ్.. పరిష్కారానికి మాత్రం నోచుకోవు.. కార్యాలయాల చుట్టూ ప్రజలకు ప్రదక్షిణలు మాత్రం తప్పవు.
తిరుపతి అర్బన్ : జిల్లాలో చిన్నపాటి సమస్యల పరిష్కారానికి కూడా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సచివాలయ నుంచి తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలతోపాటు కలెక్టరేట్ చుట్టూ పలుమార్లు తిరగాల్సిన దుస్థితి దాపురించింది. ప్రతి చోటా అర్జీలు మాత్రం తీసుకుంటారు.. ఇక స్పందన ఉండదు. మళ్లీ వెళితే ఏదో కారణం చెప్పి మరో కార్యాలయానికి వెళ్లమంటారు. ఈ క్రమంలో చివరకు కలెక్టరేట్కు వెళ్లినా ఫలితం శూన్యంగా కనిపిస్తోందని పలువురు అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంటూ ఉన్నతాధికారులందరూ కొలువుదీరుతారు. సమస్యలు తీరకపోతాయా అనే ఆశతో అర్జీదారులు సైతం పెద్దసంఖ్యలో బారులు తీరుతారు. కనీస వసతులు కూడా కల్పించని పరిస్థితుల్లో ఆకలి, దప్పులతో అలమటిస్తూ గంటల తరబడి నిరీక్షిస్తారు. ఎట్టకేలకు తొక్కుకుంటూ.. తోసుకుంటూ అధికారుల ముందు నిలబడతారు. వారు వింటారో లేదో.. తెలియని వాతావరణంలో తమ గోడు వెళ్లబోసుకుంటారు. కష్టం తీరుస్తారేమో అనే ఆశతో వినతులు సమర్పిస్తారు. అయితే ప్రజలకు పడిగాపులే చివరకు మిగులుతున్నాయి. ఆశలు నిరాశగానే మారుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రభుత్వం పట్టించుకోదు. ఇదే అదునుగా అధికారులు సైతం నిర్లక్ష్యం వహించి గ్రీవెన్స్ లక్ష్యాలను నీరుగార్చేస్తున్నారు. ప్రజలు మాత్రం చేతిలో అర్జీలు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
కలెక్టరేట్ గ్రీవెన్స్కు వచ్చిన అర్జీదారులు
పట్టించుకునేవారే లేరు
మేం దివ్యాంగులం. నాకు పుట్టుకతో ఓ కాలు లేదు. నా భార్య సుప్రియ చేతికి వేళ్లులేదు. నా తండ్రి ఒక్కసారి ట్యాక్స్ కట్టాడని మా రేషన్ కార్డును 10 నెలల క్రితం రద్దు చేశారు. పింఛన్ కూడా తొలగించారు. దీంతో మేం వేరుగా రేషన్ కార్డు, పింఛన్ కోసం 9 నెలల క్రితం సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాం. తర్వాత 6 నెలలుగా కలెక్టరేట్లో 8 పర్యాయాలు అర్జీలు ఇచ్చాం. ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. చిన్నబిడ్డతో కలెక్టరేట్ చుట్టూ తిరిగేందుకు తిప్పలు పడుతున్నాం. మాకు పూట గడవడమే కష్టంగా ఉంది. మా ఇబ్బంది చూసి కూడా పట్టించుకునేవారే లేరు.
– కె.వెంకటేష్, సుప్రియ, పూలశెట్టిగారిపల్లె, పాకాల మండలం
ఇది ఐదోసారి
కలెక్టరేట్కు వరుసగా ఇప్పటి వరకు ఐదు సోమవారాలు వచ్చాం. అర్జీలు ఇచ్చిపోతున్నాం. మాకు ఇంటి స్థలం ఇప్పించాలని వినతులు సమర్పిస్తున్నాం. అర్జీలు అయితే తీసుకుంటున్నారు. సమస్యకు మాత్రం పరిష్కారం చూపడం లేదు. అత్యంత పేద కుటుంబానికి చెందినవాళ్లం. రెక్కాడితేగానీ డొక్కనిండని బతుకులు, ఇంటి అద్దెలు భరించలేని దుస్థితి. ఆరోగ్యం సక్రమంగా ఉండదు. దీంతో తిరగలేకపోతున్నాం. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. – కె.నాగమణి, దేశయ్య, బొమ్మగుంట, తిరుపతి

సచివాలయం నుంచి కలెక్టరేట్కు..

సచివాలయం నుంచి కలెక్టరేట్కు..

సచివాలయం నుంచి కలెక్టరేట్కు..

సచివాలయం నుంచి కలెక్టరేట్కు..

సచివాలయం నుంచి కలెక్టరేట్కు..

సచివాలయం నుంచి కలెక్టరేట్కు..