
వ్యర్థాల నిర్వహణ పరిశీలన
తిరుపతి తుడా : తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెత్త నిర్వహణ ప్లాంట్లను కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ బృందం, కమిషనర్ మౌర్యతో కలిసి గురువారం పరిశీలించారు. ఇందులో భాగంగా తూకివాకం, రామాపురం చెత్త నిర్వహణ ప్లాంట్లతో పాటు తిరుపతి నుంచి తూకివాకం వరకు మురుగు నీటి సరఫరా అయ్యే భూగర్భ డ్రైనేజీ పైపులైన్ రేణిగుంట మార్గంలో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం తూకివాకం వద్ద గల మురుగు నీటిశుద్ధి కేంద్రం, తడి, పొడి చెత్త, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను పరిశీలించారు. మురుగు నీరు శుద్ధి చేసి ఫ్యాక్టరీలు, పంటలకు సరఫరా చేస్తున్నామని కమిషనర్ వివరించారు. అనంతరం రామాపురం వద్ద గల బయో మైనింగ్ ప్లాంట్ను పరిశీలించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వహణపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కార్యక్రమంలో అమృత్ పథకం సంయుక్త కార్యదర్శి ఇషా కాలియా, సాంకేతిక సలహాదారు రోహిత్ కక్కర్, రాష్ట్ర కార్యదర్శి సురేష్ కుమార్, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి , మున్సిపల్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.