
నేడు ఏపీపీఎస్సీ పరీక్ష
తిరుపతి అర్బన్: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు డీఆర్వో నరసింహులు తెలిపారు. ఆయన శుక్రవారం పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం రోడ్డు సత్య ఎన్క్లేవ్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 472 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్ష మూడు సెషన్స్లో జరుగుతుందన్నారు. శనివారం ఉదయం 9.30 నుంచి 10.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు రెండో సెషన్, అదేవిధంగా సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్ ఉంటుందన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రికల్ వస్తువులకు అనుమతి లేదని వివరించారు. కార్యక్రమంలో ఏపీపీఎస్సీ పరీక్షల అసిస్టెంట్ సెక్రటరీ రాజ్గోపాల్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కేవీఎస్ అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఠాణాలోనే దళిత నేతపై దాడి
పెళ్లకూరు : మండలంలోని పునబాక గిరిజన కాలనీకి చెందిన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్న దళిత నేత యాగాని బెన్నీపై అదే గ్రామానికి చెందిన కొందరు పోలీస్ స్టేషన్లోనే దాడికి పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం మేరకు గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన అమాస సాయి కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్న బెన్నీపై స్టేషన్లోనే నీలం నరసింహులు, రెడ్డి శ్రీనివాస్, సుమన్రెడ్డి, తాళ్ల నితిన్, నీలం రాజేష్ తదితరులు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళలను మోసగించే
అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు
● 114 గ్రాముల బంగారం స్వాధీనం
శ్రీకాళహస్తి : మహిళలకు మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపి బంగారు నగలు దొంగలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను శుక్రవారం రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.11 లక్షలు విలువ గల 114 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ఇలా.. శ్రీకాళహస్తిలో గత ఏడాదిలో ఓ మహిళను బురిడీ కొట్టించి 58 గ్రాముల బంగారు కొట్టేసిన కేసులో నెల్లూరుకు చెందిన సునీత స్థానిక సచివాలయ ఉద్యోగి ఫిర్యాదు చేయగా వీరిని పట్టుకున్నామన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ ఒక బాలున్ని అడ్డం పెట్టుకుని మోసం చేసి డబ్బులు దోచుకోవడం, బంగారు నగలు ఇస్తే డబ్బులు ఇస్తామని తమ వద్ద బంగారు నగలు ఉన్నాయని మీ వద్ద బంగారు ఇస్తే కొత్త బంగారు ఎక్కువ ఇస్తామని మాయమాటలు చెప్పి నగలు, డబ్బులు అపహరిసున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండులో అరెస్టు చేసినట్లు తెలిపారు. మూడు చోరీల్లో దోచుకున్న నగలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ నియోజక వర్గానికి చెందిన దుమ్మగూడ ప్రాంతంలో నివాసం ఉండే గుజరాతి కిషన్(24), న్యూఢిల్లీ నుంచి వచ్చి మల్కాజ్గిరిలో ఉంటున్న ప్లాస్టిక్ పవ్వుల వ్యాపారం చేస్తున్న శ్యామ్లా(30)ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు వీరిద్దరిపై తెలంగాణలో 7 కేసులు నమోదు అవ్వడంతో పాటు జైలుశిక్ష కూడా అనుభవించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి, కడప, చిత్తూరులో మూడు కేసులు నమోదు అయ్యాయని చెప్పారు.