జనగామ: సంతానం కోసం కలలు కంటున్న దంపతుల ఆశలు ఫలించాయి. ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చింది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ మహిళ. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన మాచర్ల మౌనిక, రమేష్ దంపతులకు ఎనిమిది ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం లేకపోవడంతో అనేక ఆస్పత్రులకు తిరిగారు. చివరకు జనగామ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకున్నారు.
గర్భం దాల్చిన మౌనిక స్కానింగ్ సమయంలో ముగ్గురు శిశువులు ఉన్నట్టు నిర్ధారించగా, వైద్యుల సూచనల మేరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతినెలా రెగ్యులర్ చెకప్లు చేయించుకున్నారు. ఈ నెల 21న మౌనికకు పురిటినొప్పులు రావడంతో అదే ఆస్పత్రిలో చేరి్పంచారు. డాక్టర్ స్వప్న, లింగమూర్తి నేతృత్వంలోని వైద్యబృందం సిజేరియన్ ద్వారా కాన్పు చేశారు.
ఒకేసారి ముగ్గురు మగ శిశువులు జన్మించడంతో కుటుంబ సభ్యులతోపాటు ఆస్పత్రి సిబ్బంది సంబరపడ్డారు. పుట్టిన ముగ్గురు పిల్లలు, తల్లీ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ‘ఎనిమిదేళ్లుగా పిల్లల కోసం ఎదురుచూశాం. దేవుడి దయ, డాక్టర్ చలవతో ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు పుట్టారు. మా ఆనందానికి అవధులు లేవు’.. అని తండ్రి రమేష్ సంతోషం వ్యక్తం చేశాడు.


