సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) తీపి కబురు అందించింది. తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగిన ఆర్టీసీ సిబ్బందికి సామాజిక భద్రతను మరింత పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు మాత్రమే వర్తిస్తున్న బీమా సౌకర్యాన్ని, ఇప్పుడు సహజ మరణాలకు (Natural Death) కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.
యూనియన్ బ్యాంక్లో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగి సహజంగా మరణించినా, వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందుతుంది. ఏప్రిల్ 1 నుండి అమలు: ఈ నూతన నిబంధన 2026, ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఈ సౌకర్యం కోసం ఉద్యోగులు రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా బ్యాంకే భరిస్తుంది. గతంలో ఉన్న రూ. 1 కోటి ప్రమాద బీమా సౌకర్యం యథాతథంగా కొనసాగుతూనే, ఈ సహజ మరణ బీమా అదనంగా చేరింది. దాదాపు 38వేలపైగా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది.


