అదనపు కట్నం డిమాండ్ చేస్తూ ఓ యువకుడు పెళ్లికి రెండ్రోజుల ముందు పరారయ్యాడు. దీంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది. తమకు న్యా యం చేయాలంటూ పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆ యువకుడి ఇంటి ఎదుట అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో మంగళవారం చోటు చేసుకుంది.
బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్కు చెందిన వీరబోయిన రాజయ్య రెండో కుమారుడు కిరణ్కు, ఎల్కతుర్తి మండలం దండేపల్లికి చెందిన పొన్నాల రాజయ్య కూతురితో వివాహం నిశ్చయమైంది. వరకట్నంగా రూ.26 లక్షలు, రెండున్నర తులాల బంగారం ఇచ్చే ఒప్పందంతో నిశ్చితార్థం చేసుకుని మార్చి 6న వివాహ ముహూర్తం పెట్టుకున్నారు. నిశ్చితార్థ సమయంలో రూ.10 లక్షల నగదు, అరతులం బంగారు ఉంగరం, రూ.72 వేల విలువ గల గొర్రెలు ముట్టజెప్పారు. ఆ తర్వాత తనకు అదనంగా మరో రూ.9 లక్షలు కావాలని కిరణ్ డిమాండ్ చేశాడు.

తాము అంత ఇచ్చుకోలేమని చెప్పడంతో పెళ్లికి రెండ్రోజుల ముందు మార్చి 4న కిరణ్ పరారయ్యాడని అతడి తల్లిదండ్రులు తమకు చెప్పడంతో మార్చి 6న జరగాల్సిన పెళ్లి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కట్నం కోసమే కిరణ్ను తల్లిదండ్రులే దాచిపెట్టారని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా, మార్చి 4న కిరణ్పై కమలాపూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపారు. ఈ ఘటనపై ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్కుమార్ను వివరణ కోరగా ఫిర్యాదు అందలేదని తెలిపారు.
చదవండి: పిట్ట ముట్టడం లేదని.. చెట్టును పెంచాడు!


