కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి ఇండిగో విమానానికి ప్రమాదం జరిగింది. పార్కింగ్ బేలో ఉన్న విమానాన్ని డ్రైవర్ లేని ఒక వాహనం (SUV) వచ్చి ఢీకొట్టింది.అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, మంగళవారం కోల్కతా విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్బస్ A320 (ఫ్లైట్ 6E 6663) విమానాన్ని ఒక క్యాటరింగ్ ట్రక్కు ఇండిగో విమానాన్ని ఢీకొట్టడంతో, ఆ విమానానికి స్వల్ప నష్టం వాటిల్లింది.ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానం విమానాశ్రయ టార్మాక్పై నిలిపి ఉంది. వాహనంలో మనుషులు లేనప్పటికీ ఇది ముందుకు వచ్చి విమానాన్ని ఢీకొట్టిందని ఇండిగో ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ విమానం కోల్కతా నుంచి గౌహతికి వెళ్లాల్సి ఉంది. ఈ ప్రమాదం నేపథ్యంలో విమానాన్ని కార్యకలాపాలకు తిరిగి అనుమతించే ముందు, క్షుణ్ణమైన తనిఖీలు , అవసరమైన నిర్వహణ నిమిత్తం తాత్కాలికంగా దీన్ని నిలిపివేశారు. దీంతో ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని, ఇండిగో సంస్థ గౌహతి వెళ్లడానికి వేరే విమానాన్ని ఏర్పాటు చేసింది.
అయితే ఈ వాహనానికి డ్రైవర్ హ్యాండ్బ్రేక్ వేయకుండా దిగిపోయాడు. దీనివల్ల ఆ వాహనం దానంతట అదే కదులుతూ వెళ్లి విమానం కుడి ఇంజిన్ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు గానీ, సిబ్బంది గానీ లేరు. కాబట్టి ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ భద్రతపై ఈ ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రస్తుతం అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. నిబంధనల ప్రకారం భద్రతా ప్రోటోకాల్స్ పాటించారా లేదా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.


