యాదగిరిగుట్టలో శిల్ప కళాశాల ప్రారంభం  | Telangana: Shilpa Kalasala Started In Yadagirigutta | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్టలో శిల్ప కళాశాల ప్రారంభం 

Dec 5 2022 12:44 AM | Updated on Dec 5 2022 10:54 AM

Telangana: Shilpa Kalasala Started In Yadagirigutta - Sakshi

శిల్ప కళాశాలలో ప్రారంభ పూజ  నిర్వహిస్తున్న ఈవో గీతారెడ్డి 

యాదగిరిగుట్ట: వైటీడీఏ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ అనుబంధంగా ఏర్పాటు చేసిన సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశా లను ఆదివారం ఆలయ ఈవో గీతారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్ప కళాశాలలో ముందుగా గీతారెడ్డి, ఆచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శిల్ప కళాకారులను ప్రోత్సహించేలా యాదగిరిగుట్టలో సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలను వైటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.

పాత హైస్కూల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు 15 మంది విద్యార్థులకు సంప్రదాయ శిల్ప, ఆలయ వాస్తు కోర్సులో మొత్తం నాలుగు పాఠ్యాంశాలను బోధించనున్నట్లు తెలిపారు. ఈ కోర్సు మూడేళ్లు ఉంటుందన్నారు.

కళాశాలలో విద్యార్థులకు జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ కవిత ప్రత్యేక ప్రోత్సాహంతో పాఠ్య పుస్తకాలు రూపొందించారని వెల్లడించారు. కళాశాల ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం సమయంలో వైటీడీఏ వైస్‌చైర్మన్‌ కిషన్‌రావు పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ మోతీలాల్, శిక్షకులు హేమాద్రీ, మొగిలి, అధికారులు భాస్కర్‌ శర్మ, కృష్ణస్వామి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement