సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, హైదరాబాద్ పరిధిలో నిన్న అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. వదంతుల వ్యాప్తిచెందిన కారణంగా వాహనాల్లో డీజిల్, పెట్రోల్ నింపుకునేందుకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదు. ఆయిల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. అవసరానికి మించి ఎవరు కొనుగోలు చేయవద్దు అని హెచ్చరించింది.
మరోవైపు.. రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశంలో పాల్గొననున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై చర్చించనున్నట్టు సమాచారం.



