సాక్షి, హైదరాబాద్: నగర మార్కెట్లో నిమ్మకాయల ధరలు దిమ్మతిరిగిపోతున్నాయి. అకాల వర్షాలు, ఉత్పత్తులు పడిపోవడంతో వంటి కారణాలతో వీటి ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్లో ఒక నిమ్మకాయ రూ.10 పలుతోంది. దారుషిఫా హోల్సేల్ మార్కెట్లో 25 కిలోల నిమ్మకాయల బస్తా ప్రస్తుతం రూ.2,000 నుంచి రూ.3,500 చొప్పున విక్రయిస్తున్నారు.
తక్కువ నాణ్యత నిమ్మకాయలు టోకు మార్కెట్లో బస్తాకు రూ.1,500 నుంచి రూ.1,800కు అమ్ముడవుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, నకిరేకల్, నార్కట్పల్లి, చిట్యాల తదితర ప్రాంతాల నుంచి నగరానికి నిమ్మకాయలు వస్తుంటాయని, మార్చి మధ్య నుంచి సరఫరా దాదాపు సగానికి తగ్గిపోయిందని మరో వ్యాపారి నరేష్ కుమార్ పేర్కొన్నారు.
25 కిలోల బరువున్న 1,200 నుంచి 1,500 బస్తాల నిమ్మకాయలు గతంలో రాగా, ఇప్పుడు కేవలం 800–1,000 బస్తాలు మాత్రమే వస్తున్నాయని ఆయన తెలిపారు. మధ్యవర్తులు ప్రధాన డీలర్ల నుంచి నిమ్మకాయలు కొనుగోలు చేసి, ఆ తర్వాత కూరగాయల వ్యాపారులకు సరఫరా చేయడంతో రిటైల్ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. నిమ్మకాయల కొరత కారణంగా హోటల్ యజమానులు బిర్యానీ, చైనీస్ ఫాస్ట్ ఫుడ్తో పాటు సలాడ్లలో వడ్డించడం తగ్గించేశారు.


