
రాష్ట్రంలో గత రెండు నెలల్లో అతి తక్కువ ద్రవ్యోల్బణం
మార్చిలో 1.06 శాతం, ఫిబ్రవరిలో 1.31 శాతం నమోదు
మార్చిలో జాతీయస్థాయిలో 3.34 శాతం
గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తగ్గుతోందంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోందా? గత రెండు నెలల్లో నమోదైన వినియోగ ధరల సూచీ (కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్) ద్రవ్యోల్బణం ఇదే విషయాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. ప్రజల చేతిలో డబ్బులు తగ్గిపోవటంతో వారి కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. మార్చి నెలలో తెలంగాణలో దేశంలోనే అత్యల్పంగా 1.06 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. జాతీయ స్థాయి లో ఇది సగటున 3.34 శాతంగా ఉంది.
ఫిబ్రవరిలో కూడా జాతీయస్థాయిలో ద్రవ్యోల్బణం 3.32 శాతం ఉండగా.. తెలంగాణలో 1.31 శాతం మాత్రమే నమోదైంది. వరుసగా రెండునెలల పాటు అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదు కావటం ప్రమాద సంకేతమేనని నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణ తర్వాత ఢిల్లీ (1.48 శాతం), జార్ఖండ్ (2.08 శాతం), ఆంధ్రప్రదేశ్ (2.50 శాతం)లో మార్చిలో తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది.
ఇక అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రాల్లో 6.59 శాతంతో కేరళ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (4.44 శాతం), ఛత్తీస్గఢ్ (4.25 శాతం) జమ్ముకశ్మిర్ (4 శాతం), మహారాష్ట్ర (3.86 శాతం) నిలిచాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2 నుంచి 4 శాతం మధ్యలో ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాలు ఆర్థికపరంగా బాగున్నట్టుగా పరిగణిస్తారు.
తక్కువ ఉన్నా సమస్యే..
పైపై అంచనాలు, అంశాలవారీగా చూస్తే అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా ఉన్నట్లు కనిపించినా.. అందుకు వ్యవస్థీకృతంగా బలీయమైన సమస్యలు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదు కావటానికి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తగ్గుదల, వస్తువులకు డిమాండ్ తగ్గడం కారణం కావొచ్చని పేర్కొంటున్నారు. అయితే, రాబోయే నెలల్లోనూ ద్రవ్యోల్బణం తీరుతెన్నులు పరిశీలిస్తే తప్ప ఒక స్పష్టమైన నిర్ధారణకు రాలేమని అంటున్నారు. రానున్న నెలల్లోనూ రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తక్కువగా నమోదైతే అది వాస్తవ పరిస్థితుల ఆధారంగా జరుగుతుందని భావించవచ్చని చెబుతున్నారు.
వ్యవసాయ రంగమూ దెబ్బతింది
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. వివిధ పథకాల కింద నగదు బదిలీ అంతగా జరగడం లేదు. వ్యవసాయరంగం కూడా కొంతమేర దెబ్బతిన్నది. దీంతో ప్రజలు వస్తువులను కొనలేని పరిస్థితి వచ్చి వాటికి డిమాండ్ తగ్గిపోయి, ద్రవ్యోల్బణం తగ్గినట్టుగా కనిపిస్తోంది. జీడీపీ పెరుగుదల రేటు తగ్గింది. తలసరి ఆదాయం కూడా పడిపోవడంతో మార్చిలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. కోవిడ్ సమయంలో తప్ప దేశంలో ఎక్కడా జీఎస్టీ వసూళ్లు తగ్గిన సందర్భాలు లేవు. –డి.పాపారావు, ఆర్థిక విశ్లేషకుడు.