సాక్షి, హైదరాబాద్: ప్రజావాణి కార్యక్రమంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి వ్యవస్థను ప్రభుత్వం విస్తరించనుంది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలకు ప్రజావాణి విస్తరణకు ప్రభుత్వం నిర్ణయిం తీసుకుంది. ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో, ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాష్ట్ర స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం కార్యక్రమం నిర్వహించనున్నారు.
ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సర్కార్.. అన్ని ఫిర్యాదులు ప్రజావాణి పోర్టల్లో నమోదు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారులకు యూనిక్ రిఫరెన్స్ నంబర్తో రసీదు ఇవ్వనున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి గరిష్టంగా 30 రోజులు గడువును ప్రభుత్వం నిర్ణయించింది. గడువు లోపల పరిష్కారం కాకపోతే పైస్థాయికి ఎస్కలేషన్ ఇవ్వనున్నారు.
ఆన్లైన్లో ఫిర్యాదు స్థితి ట్రాకింగ్ సౌకర్యం, యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ (ATR) ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానుంది. ప్రజలతో పారదర్శకత, బాధ్యత పెంచే చర్యలు చేపట్టనుంది. రాష్ట్ర స్థాయి కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.. ప్రతి విభాగంలో ప్రత్యేక ప్రజావాణి విభాగాల ఏర్పాటు చేయనుంది. అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలిచ్చిన ప్రభుత్వం.. ప్రజల అభ్యర్థనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.


