Rythu Bandhu 2021: రైతుబంధు.. టాప్లో ఏ జిల్లా అంటే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 62.99 లక్షల మంది రైతులకు యాసంగి రైతుబంధు సొమ్ము అందింది. మొత్తం 1.48 కోట్ల ఎకరాలకు చెందిన రైతుల ఖాతాల్లో రూ.7,411.52 కోట్లు జమయ్యాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు రూ. 601,74,12,080 నిధులు అందాయి. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 33,452 మంది రైతులకు రూ.33.65 కోట్లు జమయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉపాధి హామీని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయరంగంలో కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధరలను ఆయా రాష్ట్రాలను, ప్రాంతాలను బట్టి నిర్ణయించాలని సూచించారు. పండించిన పంటలన్నీ కేంద్రం మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.