టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటన
నేడు మూడు నోటిఫికేషన్లు ఇస్తాం
ఎన్విరాన్మెంట్, సివిల్, ఎలక్ట్రికల్ కేటగిరీల్లో 280 ఖాళీల భర్తీ
వారంలో మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తాం
అన్ని పరీక్షలు సీబీటీ పద్ధతిలోనే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 3,800 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మూడు కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం ఆయన కమిషన్ సభ్యులు, కార్యదర్శి హరితతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మంగళవారం ఆర్అండ్బీ పరిధిలో 222 ఏఈ (సివిల్), ఏఈ (ఎలక్ట్రికల్) 49, కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోని 9 అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు.
నెలాఖరులోగా మరో మూడు నోటిఫికేషన్లు ఇచ్చేందుకూ కమిషన్ కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం కమిషన్ వద్ద 3,800 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనుమతులు ఉన్నాయన్నారు. వీటిలో 28 ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఒకటి, రెండు ఉద్యోగాలున్నాయని, మరో 20శాఖలకు సంబంధించి 5 కంటే తక్కువ ఉద్యోగాలున్నాయన్నారు. 50 కంటే ఎక్కువ ఉద్యోగాలున్నవి 11 శాఖలు ఉన్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేర్వేరుగా ఇచ్చే బదులు... సబ్జెక్టు, తదితర అంశాలను ఒకే విధంగా ఉన్నవాటిని ఒకచోట చేర్చి రెండంకెల స్థాయిలో నోటిఫికేషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కేటగిరీలో 1,393 ఉద్యోగాలున్నాయని, మల్టీ జోన్ వారీగా నోటిఫికేషన్లు ఇచ్చేలా యోచిస్తున్నామన్నారు.
ప్రతి నెలా నోటిఫికేషన్లు..
ఉద్యోగాల భర్తీకి ప్రతి నెలా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కమిషన్ కృషి చేస్తోందని, రెండు, మూడు నెలలకు ఫలితాలు ఇచ్చేలా ప్రణాళిక తయారు చేసుకుంటున్నామని బుర్రా వెంకటేశం చెప్పారు. టీజీపీఎస్సీ పరిధిలో నిర్వహించే ప్రతీ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పరీక్ష రాసిన వెంటనే మార్కులు డిస్ప్లే అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మాన్యువల్ పద్ధతిలో ఓఎంఆర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కొత్త నోటిఫికేషన్లు వెలువడినప్పుడు వన్ టైమ్ రిజి్రస్టేషన్ (ఓటీఆర్)కు అవకాశం ఉంటుందన్నారు.


