నిజామాబాద్ రూరల్: ఆ ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఎల్లలు లేవని నిరూపించింది. శ్రీలంక అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శనివారం మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. నిజామాబాద్ రూరల్ మండలం లింగితండాకు చెందిన బొంత వెంకటేశ్ 2019లో దుబాయికి వెళ్లాడు.
అక్కడ ఎల్టన్ ప్రాపర్టీ అనే కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీలంక దేశానికి చెందిన ఉమేక తారుషి వెంకటేశ్ల మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారు తల్లితండ్రుల సమక్షంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో తమ ప్రేమ విషయాన్ని వెంకటేశ్ శ్రీలంకకు వెళ్లి తారుషి తల్లితండ్రులకు చెప్పి ఒప్పించాడు.
ఇటు వెంకటేశ్ తల్లితండ్రులు ఒప్పుకున్నారు. దీంతో తారుషి, ఆమె తల్లితండ్రులు సేనాదిపతిగే నిలంతి పెరీరా, గలాని గమగె జనక ప్రియదర్శన సిల్వా లింగి తండాకు పది రోజుల క్రితం చేరుకున్నారు. శుక్రవారం ఇరు కుటుంబాల సంతోషాల మధ్య హల్దీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం వీరి వివాహానికి లింగి తండా వేదికగా మారనుంది. తమ ప్రేమ వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెంకటేశ్ ‘సాక్షి’తో తెలిపారు.



