Telangana: After Completing One Year of Polytechnic Can Join Intermediate - Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ చేసినా.. ఇంటర్‌లో చేరొచ్చు

Dec 28 2022 1:30 AM | Updated on Dec 28 2022 1:32 PM

Telangana: After Completing One Year Of Polytechnic Can Join Intermediate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ కోర్సు మొత్తం పూర్తి చేస్తే... ఇంజనీరింగ్‌ రెండో ఏడాదిలో చేరే వీలుంది. కానీ ఇక మీదట పాలిటెక్నిక్‌ ఏడాది పూర్తి చేసినా.. రెండో సంవత్సరం ఇంటర్‌లో చేరే అవకాశం రాబోతోంది. ఇందుకు సంబంధించిన మార్పులకు సాంకేతిక విద్యా మండలి శ్రీకారం చుట్టనుంది. ఇంజనీరింగ్‌లో ఈ విధానం ఈ ఏడాది నుంచే అమలులోకి తీసుకొచ్చారు.

ఇంజనీరింగ్‌ రెండేళ్ళు పూర్తి చేసిన విద్యార్థులకు డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌ అనే డిగ్రీ ఇవ్వాలనే విధానాన్ని  అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఎగ్జిట్‌ విధానాన్ని ఇక మీదట పాలిటెక్నిక్‌కు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాలిటెక్నిక్‌ లోనూ మధ్యలో మానేసిన వారికి క్రెడిట్స్‌ విధానంతో కూడిన డిగ్రీని ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. సాంకేతిక విద్యా మండలి ఈ దిశగా పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.  

సమయం వృథా కాకుండా... ‘క్రెడిట్‌ ’
టెన్త్‌ తర్వాత చాలామంది విద్యార్థులు పాలి టెక్నిక్‌ను ఎంచుకుంటారు. గత కొన్నేళ్ళుగా పాలి టెక్నిక్‌ కాలేజీల్లో సరైన సదుపాయాలు లేకపోవ డం,  ప్రైవేటు కాలేజీలు ఫ్యాకల్టీకి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల సదరు కోర్సులో ఉత్తీర్ణత పెద్దగా ఉండటం లేదు. చాలా మంది వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అవుతున్నారు. ఎన్ని సార్లు పరీక్షలు రాసినా ఉత్తీర్ణులు కాలేకపోతు న్నారు. ఈ కారణంగా మధ్యలోనే విద్యను మానే స్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.   దీన్ని నివారించేందుకు క్రెడిట్‌ విధానం తీసుకొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. చదివినంత వరకైనా కొన్ని క్రెడిట్స్‌ను నిర్ధారిస్తూ డిగ్రీ ఇస్తే ఉపయోగంగా ఉంటుందనే ఆలోచనకు వచ్చారు.

ఇంటర్‌లో చేరే అవకాశం..
పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం పూర్తి చేసి, ఆ తర్వాత ఆపివేస్తే ఇంటర్‌ ఫస్టియర్‌కు సమానమైన సర్టిఫికెట్‌ ఇవ్వాలని సాంకేతిక విద్యామండలి ప్రతిపాదించింది. అంటే ఫస్టియర్‌ పాలిటెక్నిక్, ఇంటర్‌ మొదటి సంవత్సరానికి సమానమైందని ధ్రువీకరించనున్నారు. దీంతో ఆ విద్యార్థి ఇంటర్‌ సెకెండియర్‌లో చేరేందుకు అవకాశం ఉంటుంది.

అదేవిధంగా మూడేళ్ల పాలిటెక్నిక్‌లో రెండేళ్ళు పూర్తి చేసి, ఆ తర్వాత మానేసినా, మూడేళ్ళు చదివి, మూడో ఏట ఫెయిల్‌ అయినా, ఆ విద్యార్థి క్రెడిట్స్‌ను 90 సాధిస్తే సర్టిఫికెట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ ఇస్తారు. వీళ్లు బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో చేరేందుకు అవకాశం లభిస్తుంది. పాలిటెక్నిక్‌ మూడేళ్ళ కోర్సుకు 150 క్రెడిట్స్‌ను నిర్థారిస్తున్నారు. ఇందులో 130 క్రెడిట్స్‌ వస్తే పాలిటెక్నిక్‌ పూర్తి చేసినట్టు లెక్క. వీరికి డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌ అని సర్టిఫికెట్‌ ఇస్తారు. ఏదేమైనా మూడేళ్ళు చది వితే తప్ప పాలిటెక్నిక్‌ చదువు సార్థకత అవుతుందనే విధానం ఇక మీదట తెరమరుగు కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement