
అనారోగ్యంతో కోర్టు హాల్లోకి రాలేక బాధితురాలి అవస్థ..
బయటికొచ్చిన జడ్జి.. ఫిర్యాదీ వివరాల నమోదు
రాజీ కుదరడంతో కేసు కొట్టివేత
జగిత్యాల జిల్లా: అనారోగ్యంతో కోర్టు హాల్లోకి రాలేని ఫిర్యాదీ దగ్గరకు.. స్వయంగా జడ్జి వచ్చారు. బాధితురాలి కేసుకు పరిష్కారం చూపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి కోర్టులో జరిగిన ఈ సంఘటన వివరాలివి. ఇబ్రహీంపట్నం మండలం గోధూర్కు చెందిన చల్ల రమక్క.. అదే గ్రామానికి చెందిన చల్ల మల్లేశ్, చల్ల శంకర్లపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2024 సంవత్సరంలో ఫిర్యాదు చేశారు.
రమక్క ఫిర్యాదు మేరకు 174/2024 క్రైం నంబరు కింద సెక్షన్ 329(4), 292, 118(1) ప్రకారం చల్ల మల్లేశ్, చల్ల శంకర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మెట్పల్లి కోర్టుకు చార్జిషీట్ పంపించారు. ఆ కేసుకు కోర్టులో కేలండర్ కేసు నంబర్ 549/2024 కేటాయించి నిందితుల హాజరుకు నోటీసులు పంపించారు.
నిందితులు, ఫిర్యాదీ కలిసి రాజీ చేసుకుని సోమవారం కోర్టుకు వచ్చారు. పక్షవాతంలో బాధపడుతున్న ఫిర్యాదీ చల్ల రమక్క.. కోర్టు హాల్లోకి జడ్జి అరుణ్కుమార్ ముందుకు రాలేక ఆటోలోనే ఉండిపోయారు. పరిస్థితిని తెలుసుకున్న జడ్జి అరుణ్కుమార్ కోర్టుహాల్ బయటకు వచి్చ.. ఆటోలో ఉన్న ఫిర్యాదీ చల్ల రమక్క నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ఇరు పక్షాలకు రాజీ కుదిరిన క్రమంలో.. చల్ల మల్లేశ్, చల్ల శంకర్లపై ఉన్న కేసు కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.