టికెట్‌ ధరలపై డిస్కౌంట్‌ కట్‌ | Old Fares Back In Hyderabad Metro Deluxe And AC Buses From June 1, Check Out New Prices Details Inside | Sakshi
Sakshi News home page

టికెట్‌ ధరలపై డిస్కౌంట్‌ కట్‌

May 31 2026 7:33 AM | Updated on May 31 2026 12:33 PM

Old Fares Back in Hyderabad Metro Deluxe and AC Buses from June 1

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా పెరుగుతూ వచ్చిన చమురు ధరలు ఆర్టీసీపై పెద్ద ప్రభావమే చూపుతున్నాయి. నగరంలో కొన్ని కేటగిరీ బస్సుల్లో తక్కువగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకునేందుకు గతంలో ప్రకటించిన టికెట్‌ ధరలపై డిస్కౌంట్‌ను ఆర్టీసీ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. నగరంలో తిరుగుతున్న మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ సర్వీసుల్లో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సు చార్జీలతోనే ప్రయాణించేలా ఈ డిస్కౌంట్‌ను ఆర్టీసీ ప్రకటించింది. మే నెలతో దాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఫలితంగా జూన్‌ ఒకటి నుంచి పాత చార్జీలను వసూలు చేయనున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఆర్డినరీ (పల్లె వెలుగు కూడా), మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే వీలుంది. ఈ వెసులుబాటు మొదలైనప్పటి నుంచి ఆ రెండు కేటగిరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. 

ముందు వైపు ఉండే మహిళల సీట్లు నిండిపోయి, వెనకవైపు సీట్లలో కూడా ఎక్కువగా వారే కూర్చుంటున్నారు. దీంతో పురుషులకు సీట్లు పరిమితంగానే ఉంటున్నాయి. దీనిపై వారి నుంచి వరుసగా ఫిర్యాదులొస్తున్నాయి. దీంతో గతేడాది మెట్రో డీలక్స్‌ పేరుతో కొత్త కేటగిరీ సర్వీసును ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది . ఈ సర్వీసులో మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం లేకపోవటంతో, పురుషులకు సీట్లు లభిస్తున్నాయి. కానీ, ఇందులో మెట్రో ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే రూ.5 వరకు చార్జీ ఎక్కువ. దీనివల్ల ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో నమోదుకాలేదు. 

దీన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల అభిప్రాయాలు సేకరించారు. ప్రభుత్వ పథకం వల్ల ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో సీట్లు లభించటం లేదని, ఇప్పుడు సీట్లు కావాలంటే ఎక్కువ చార్జీ చెల్లించి డీలక్స్‌ బస్సులో వెళ్లమనడం ఎలా న్యాయమని చాలామంది పేర్కొన్నారు. దీంతో ఈ డీలక్స్‌ బస్సులతోపాటు, ఏసీ కేటగిరీ అయిన మెట్రో లగ్జరీ బస్సుల్లో గత మార్చిలో స్పెషల్‌ డిస్కౌంట్‌ను ఆర్టీసీ ప్రకటించింది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సు టికెట్‌ చార్జీనే చెల్లించి వీటిల్లో ప్రయాణించే వీలు కల్పించింది. మే నెల వరకు పరిశీలించి ఆక్యుపెన్సీ రేషియో పెరిగితే, ఈ ఆఫర్‌ను కొనసాగించాలని అప్పట్లో నిర్ణయించారు.కానీ ఇప్పుడు వరసగా పలుమార్లు డీజిల్‌ ధరలను పెంచటంతో ఆర్టీసీపై పెద్ద భారం నమోదైంది.

నెలవారీ దాదాపు రూ.14 కోట్ల వరకు అదనపు భారం నమోదు కావటంతో ఈ డిస్కౌంట్‌ విషయంలో ఆర్టీసీ పునరాలోచన కొచ్చింది. నష్టాలను భరిస్తూ ఆఫర్‌ను కొనసాగించటం సరికాదని నిర్ణయించి, మే నెలతోనే దానికి మంగళం పాడి జూన్‌ నుంచి మళ్లీ పాత ధరలను ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్‌ ఒకటి నుంచి, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో రెండో స్టేజీ నుంచి ఎక్స్‌ప్రెస్‌ కేటగిరీతో పోలిస్తే రూ.5 వరకు, లగ్జరీ బస్సుల్లో అది రూ.10 వరకు ఎక్కువగా ఉండనుంది. అంటే, గత ఫిబ్రవరి వరకు కొనసాగిన చార్జీలు జూన్‌ ఒకటి నుంచి మళ్లీ అమలవుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement