
కరోనా కొత్త వేరియెంట్లు అంత ప్రమాదకరం కాదు
చాలామందిలో లక్షణాలు కూడా కనిపించటంలేదు
అలా అని నిర్లక్ష్యం చేయొద్దు.. జాగ్రత్తలు పాటించాలి
గత లక్షణాలకు అదనంగా ఈసారి డయేరియా, తీవ్ర అలసట
వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి
టీకా బూస్టర్ డోస్ వేసుకోవటం మంచిదే..
సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ ఉదయ్లాల్ సూచన
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా మళ్లీ విస్తరిస్తోంది. సినిమా భాషలో చెప్పాలంటే.. కోవిడ్కు సీక్వెల్ వచ్చింది. కరోనా వైరస్ రీ–రిలీజ్ అయ్యింది. గతంలో ఈ వైరస్ హారర్ సినిమాలా భయపెట్టింది. కానీ, తాజా సీక్వెల్ తీవ్రత మాత్రం కాస్త తక్కువే అంటున్నారు డాక్టర్లు. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్ర, తెలంగాణల్లో మరోమారు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ కొత్త వైరస్ గురించి సీనియర్ కన్సలెంట్ జనరల్ మెడిసిన్ అండ్ సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ ఉదయ్లాల్ చెబుతున్న విషయాలివి..
ప్రశ్న: ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వేరియెంట్ ఏమిటి? దానికి ప్రత్యేకతలు ఏవైనా ఉన్నాయా?
జవాబు: ప్రస్తుతం భారత్లో ఎన్.బి.1.8.1, ఎల్.ఎఫ్.07, జె.ఎన్.1 వంటి వేరియెంట్లు ఎక్కు వగా వ్యాప్తిలో ఉన్నాయి. ఎన్.బి.1.8.1, ఎల్.ఎఫ్.7 వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) జాగ్రత్తగా గమనిస్తూ ‘వేరియెంట్స్ అండర్ మానిటరింగ్’గా చెబుతోంది. ఈ వేరియంట్లన్నింటిలోనూ జె.ఎన్.1 చురుగ్గా వ్యాప్తి చెందుతోంది.
ఇది బి.ఎ.2.86 నుంచి ఆవిర్భవించినట్లు తెలుస్తోంది. చురుగ్గా వ్యాప్తిచెందినా దీని తీవ్రత చాలా తక్కువ కావడంతో రోగులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా చాలా తక్కువే. కొందరిలో ఇది వచ్చినట్టు కూడా తెలిసే అవకాశం లేదు. అంతేకాదు.. ఈ వైరస్తో వచ్చే జ్వరం, ఇతర దుష్ప్రభావాలు చాలావరకు వాటంతట అవే తగ్గిపోతున్నాయి.
ప్రశ్న: కరోనా వైరస్ తొలిసారి వచ్చినప్పుడు చాలామంది ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఈసారి కూడా తొలిసారి వస్తున్న వేరియంట్లు చురుగ్గా ఉండి ప్రాణాంతకం కావచ్చా?
జవాబు: అలా ఏమీ లేదు. అప్పట్లో కొత్తగా వచ్చిన డెల్టా వేరియంట్లు బాగా చురుగ్గా ఉండటంతో పాటు తీవ్రత కూడా ఎక్కువగా ఉండి చాలా ప్రాణ హాని కలిగించాయి. ప్రస్తుతం వస్తున్న వేరియంట్లు.. మరీ ముఖ్యంగా జె.ఎన్.1 వంటివి గతంలోని ఒమిక్రాన్ వైరస్ నుంచి మ్యూటేట్ అయినవే. గతంలో ఒమిక్రాన్ వేరియంట్ వచ్చే నాటికే వైరస్ బాగా బలహీన పడింది. కాబట్టి ఇప్పుడు ఇవి ప్రాణహాని గానీ, ఆస్పత్రిలో చేరా ల్సిన పరిస్థితినిగానీ తెచ్చి పెట్టక పోవచ్చు.
అయితే, లక్షణాల తీవ్రత ఎక్కు వగా ఉంటే బాధితు లను వీలైనంత త్వరగా హాస్పి టల్కు తరలించాల్సిందే. 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు.. క్రానిక్, అన్ కంట్రోల్డ్ బ్రాంకియల్ ఆస్తమా ఉన్నవారు, డయాబెటిస్ వంటివి ఉండి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు మినహా మిగతావారికి ఈ వేరియంట్లు ఏమాత్రం ప్రమా దకరం కాదు. అలాగని నిర్లక్ష్యంగా ఉండటం సరికాదు.
ప్రశ్న: ఇప్పుడు కనిపిస్తున్న వేరియెంట్ల లక్షణాలు ఏమిటి?
జవాబు: లక్షణాలన్నీ గతంలో లాగే ఉంటాయి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, డయే రియా వంటి లక్షణాలు కని పిస్తాయి. కాకపోతే ఈసారి లక్ష ణాల్లో కాస్త భిన్నత్వం కనిపిస్తోంది. గతంలో జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు ఎక్కువ. ఇప్పుడూ ఆ లక్ష ణాలు ఉన్నప్పటికీ డయేరియా (నీళ్ల విరేచనాలు), తీవ్రమైన అలసట (సివియర్ ఫెటీగ్), ఆకలి లేకపో వడం వంటి జీర్ణ సంబంధిత లక్షణాలు కనిపిస్తున్నాయి.
ప్రశ్న: నివారణకు ఎలాంటి జాగ్రత్తలు అవసరం?
జవాబు: గతంలో పాటించిన జాగ్రత్తలే ఈసారి కూడా పనికి వస్తాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా వేసుకో వాలి. చేతులు తరచుగా సబ్బుతో కడుక్కోవాలి. శానిటైజర్స్ ఉప యోగించాలి. భౌతిక దూరాలు పాటించడం మేలు చేస్తుంది. గర్భ వతులు బహిరంగ ప్రదేశాలు, గుంపుల్లోకి రాకపోవటం మంచిది.
తప్పని పరిస్థితుల్లో రావా ల్సి వస్తే మాస్క్ ధరించాలి. మునపటిలాగే బాధి తులతో పాటు మిగతావారు కూడా అన్ని పోషకా లు అందేలా ఆకుకూరలు, కూరగాయలతో పాటు తినేవారైతే మాంసాహారంతో మంచి పోషకా హారం, తగినంత విశ్రాంతి తీసుకుంటూ, కంటి నిండా నిద్రపోతే వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
ప్రశ్న: మునుపటిలాగే అందరూ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలా?
జవాబు: అందరూ పరీక్షలు చేయించుకోకపోయినా ఒకవేళ లక్షణాలు కనిపించినవారు మాత్రం వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. పరీక్షలో ఒకవేళ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే డాక్టర్ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారు సూచించిన లక్షణాలను తగ్గించే మందులు తీసుకోవడం అవసరం. దీనివల్ల ప్రమాదకరమైన పరిస్థితిని నివారించవచ్చు.
ప్రశ్న: కొత్త చికిత్సలు ఏమైనా అందుబాటులోకి వచ్చాయా?
జవాబు: ఇది వైరస్తో వచ్చే సమస్య కావడం వల్ల దీనికి సాధారణంగా మందులు ఉండవు. కాకపోతే లక్షణాలను బట్టి చికిత్స అందిస్తారు. ఉదాహరణకు జ్వరం, ఒళ్లునొప్పులకు పారాసిటమాల్ ఇవ్వడం వంటివి. ఇది వైరస్తో వచ్చే సమస్య కాబట్టి యాంటీబయాటిక్స్ వంటివి వాడకూడదు. గొంతునొప్పి తగ్గడానికి గోరువెచ్చని నీళ్లలో ఉప్పు వేసి పుక్కిలించాలి. చేతులు శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి.
శరీరంలో నీరు / ద్రవాల మోతాదులు తగ్గకుండా (డీ–హైడ్రేషన్కు గురికాకుండా) ఉండటం కోసం తగినన్ని నీళ్లు తాగాలి. ద్రవాహారం తీసుకోవాలి. రిస్క్ ఎక్కువ ఉన్నవారు పల్స్ ఆక్సిమీటర్తో చెక్ చేసుకుంటూ ఆక్సిజన్ మోతాదులు తగ్గుతున్నట్లు గమనిస్తే బాధితులను వెంటనే హాస్పిటల్కు తరలించాలి.
ప్రశ్న: ఈసారి మళ్లీ టీకాలు తీసుకోవాలా?
జవాబు: గతంలో టీకా తీసుకుని బూస్టర్ డోస్ కూడా తీసుకున్న వారిపై తాజా వేరియెంట్లు అంతగా ప్రభావం చూపకపోవచ్చు. అయితే, జాగ్ర త్తగా ఉండటం, వృద్ధులు బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదే. దీనివల్ల హాస్పి టల్లో చేర్చాల్సిన పరిస్థితి చాలా వరకు తగ్గుతుంది.
ప్రస్తుతం ఎమ్– ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ వంటివి బాగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. కానీ, మన దేశంలో అవి లేవు. మనకు మామూలు వ్యాక్సిన్స్ బూస్టర్ డోసులే సరిపో తాయి. సాధారణంగా ఒక మోతాదు టీకా ఆరు నెలలకు పైగానే సమర్థంగా పనిచేస్తుంది. కాకపోతే దాని ప్రభావం క్రమంగా తగ్గు తూ ఉంటుంది కాబట్టి బూస్టర్ తీసుకోవడం మంచిదే.