జాగా కోసం జాతరలా.. | Sakshi
Sakshi News home page

జాగా కోసం జాతరలా..

Published Fri, Jan 14 2022 2:57 AM

Muslims To Set Huts On Waqf Board Lands In Gollagudem - Sakshi

ఖమ్మం అర్బన్‌: ఇంకా గురువారం తెల్లవారలేదు. ఓ పక్క మంచుతెరలు.. మరోపక్క వర్షం కురిసేలా ఉన్న మబ్బులు.. ఆ సమయానికే వేల సంఖ్యలో పేద ముస్లింలు ఖమ్మం 14వ డివిజన్‌లోని గొల్లగూడెంలోని వక్ఫ్‌బోర్డు భూముల్లో గుడిసెలు వేసుకునేందుకు చేరుకున్నారు. పోలీసులు కూడా పసిగట్టలేనంత రహస్యంగా పెద్దసంఖ్యలో సామగ్రితో సహా చేరుకున్నారు. ఇంటి జాగా కోసం జాతరలా వచ్చిన వారు హద్దులు ఏర్పాటుచేసుకుని గుడిసెలు వేసేందుకు సిద్ధమయ్యారు.

సమాచారం అందుకున్న ఏసీపీ ఆంజనేయులు సిబ్బందితో చేరుకుని నచ్చచెప్పినా వారు వెనక్కి వెళ్లలేదు. మతపెద్దలైన ముజావర్లను పిలిపించి మాట్లాడించినా వినలేదు. తామంతా నిరుపేదలమని, ఇళ్ల అద్దె కట్టలేక గుడిసెలు వేసుకుంటున్నామని చెప్పారు. మధ్యాహ్నం భారీ వర్షం పడినా వెళ్లకుండా అక్కడే ఉండిపోయిన వారు రాత్రి 9 గంటల కు వెనుదిరిగారు.

గొల్లగూడెం రెవెన్యూ పరిధి లో ఈద్గాను ఆనుకుని సుమారు 80 ఎకరాల మేర వక్ఫ్‌ బోర్డు భూములున్నాయి. ఇందు లో ఇప్పటికే ఐదెకరాలకుపైగా ఆక్రమణకు గురైంది. వక్ఫ్‌బోర్డు అంటే ముస్లింలకు చెందిన భూములని, వాటిపై సర్వ హక్కులు ముస్లింలకే ఉంటాయని నమ్మబలికిన దళారులు డబ్బు వసూలు చేసి గుడిసెలు వేసేందుకు పురిగొల్పినట్లు తెలుస్తోంది. 

Advertisement
Advertisement