కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్‌: మంత్రి ఉత్తమ్‌ | Minister Uttam Kumar Reddy Fire On Kcr | Sakshi
Sakshi News home page

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్‌: మంత్రి ఉత్తమ్‌

Jun 10 2026 10:30 PM | Updated on Jun 10 2026 10:30 PM

Minister Uttam Kumar Reddy Fire On Kcr

సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించారు. బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలలో భాగంగా బోర్ హోల్స్ పనులను పరిశీలించారు.

దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలోనే రాష్ట్ర రైతాంగానికి సాగు తాగునీరు అందించడానికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టామని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం పనులు పూర్తి చేశామన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వానికి పేరు రావద్దని.. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు తెరపైకి తీసుకువచ్చారన్నారు. చేవెళ్ల నుండి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్పు చేసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు లక్ష 45 వేల కోట్లు ఖర్చు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఒక్క చుక్క నీరు కూడా ఉపయోగంలోకి రాలేదన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రాజెక్టు లోపభూయిష్టంగా ఉందని నిపుణులు నివేదిక ఇవ్వడం జరిగిందని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇతర సంస్థల చేత బ్యారేజ్ కొంగుబాటుపై దర్యాప్తు జరిపించడం జరిగిందన్నారు. ఆఫ్రి సంస్థ ఆధ్వర్యంలో రీ డిజైన్ పనులు కొనసాగుతున్నాయన్నారు. జూలై మొదటి వారంలోపు పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement