
తన తల్లికి చెడు వ్యసనాలు అలవాటు చేస్తోందని హతమార్చిన దుండగుడు
మృతదేహాన్ని కారులో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
నిజామాబాద్ రూరల్: నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నిందితుడు మృతదేహాన్ని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రూరల్ సీఐ సురేష్ ఎస్హెచ్వో ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. కంఠేశ్వర్ బైపాస్ నుంచి దాస్నగర్ కెనాల్ కట్టవైపు వెళుతున్న ఓ కారు సిగ్నల్స్ వద్ద ఆపకపోవడంతోపాటు, కారు డిక్కీలోని కవర్ బయటకు కనబడటంతో పోలీసులకు అనుమానం వచ్చి వెంబడించారు.
మాక్లూర్ పోలీసులు కారును ఆపగా, డిక్కీలో మహిళ మృతదేహం ఉండటంతో రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడు రాజేష్ ను అదుపులోకి తీసుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతురాలు ముబారక్ నగర్ ప్రాంతానికి చెందిన బింగి కమల(46)గా గుర్తించారు. ముబారక్ నగర్కు చెందిన రాజేష్ వాళ్ల అమ్మకు అదేప్రాంతానికి చెందిన కమల చెడు వ్యసనాలు అలవాటు చేస్తోంది. దీంతో ఆగ్రహించిన రాజేష్ గురువారం కమలను కంఠేశ్వర్ బైపాస్ లోపలికి తీసుకెళ్లాడు.
ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగగా రాజేష్ కమలను బండరాయితో మోదీ హత్య చేశాడు. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని కాలువలో పడేయడానికి కారు డిక్కీలో పెట్టి బయలుదేరాడు. మృతదే హానికి కప్పిన కవర్ బయటకు రావడం, సిగ్నల్స్ వద్ద కారు ఆపకపోవడంతో పోలీసులు అనుమానం వచ్చి అతడిని పట్టుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పాంగ్రాలో మరో మహిళ..
ఖలీల్వాడి: నగరంలోని పాంగ్రా కల్లుబట్టి సమీపంలో ఓ మహిళ హత్యకు గురైంది. సీఐ శ్రీనివాసురాజు తెలిపిన వివరాలు ఇలా.. పాంగ్రా కల్లుబట్టి సమీపంలోని ఇంట్లో నివాసముంటున్న చంద్రకళ(50)కు తన కూతురు మౌనిక నాలుగు రోజులుగా ఫోన్ చేసిన స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన మౌనిక శుక్రవారం ఇంటికి వచ్చి చూడగా చంద్రకళ హత్యకు గురైనట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు, ఈనెల 23న ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులు మహిళ ఒంటిపై ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారురు. పోలీసులు పలువురు యువకులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.