శ్రీనగర్ కాలనీ (హైదరాబాద్): ప్రపంచవ్యాప్తంగా వైరలైన.. హీరో మహేష్బాబు సినిమా ‘గుంటూరు కారం’లోని ‘ఆ కుర్చీని మడతపెట్టి’పాటకు పరోక్షంగా కారణమైన కుర్చీ తాత అలియాస్ మహ్మద్ కాలా బాషా (66) బుధవారం మృతి చెందాడు. దీంతో సోషల్ మీడియా పలువురు నివాళులర్పిస్తున్నారు.
ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో తమ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంభాషణను వివరిస్తూ కుర్చీని మడత పెట్టి అనే పదం వాడాడు కాలా బాషా. అది అలా సోషల్ మీడియాలో విపరీతంగా వెళ్లింది. అనంతరం ‘గుంటూరు కారం’సినిమాలో ఆ పదంతో పాట వచ్చి సంచలనం సృష్టించింది. విదేశీయులు సైతం ఈ పాటకు స్టెప్స్ వేసేవరకు వెళ్లింది.
బోరబండ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటూ.. రోజూ యూసుఫ్గూడ, కృష్ణకాంత్పార్క్ పరిసరాల్లో తిరుగుతుండేవాడు. బస్సులు ఎక్కి ఇంగ్లీష్లో డబ్బులు అడుక్కునేవాడు. అలా ఓ ఇంటర్వ్యూలో కుర్చీని మడతబెట్టి ... డైలాగ్తో కాలా బాషా కుర్చీతాతగా ప్రాచుర్యం పొందాడు. సోషల్ మీడియాలో మీమ్గా వైరల్ కావడంతో పలువురు ఇంటర్వ్యూలు చేసేవారు. అలా సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయాడు.
బాషాకు మద్యం అలవాటు ఉంది. పలుసార్లు అనారోగ్యానికి గురయ్యాడు. ఇంతకు ముందు కూడా కాలా బాషా చనిపోయినట్లు ప్రచారం జరిగింది. అయితే వైజాగ్ సత్యలాంటి వాళ్లు అది ఫేక్ న్యూస్ అని తేల్చేశారు. ఎండ తీవ్రత తట్టుకోలేక బుధవారం సాయంత్రం కృష్టకాంత్ పార్క్ వద్ద స్పృ హ తప్పి పడిపోయాడు. అక్కడివారు గమనించి కుటుంబసభ్యులకు తెలియజేయగా ఇంటికి తీసుకెళ్లాక మృతి చెందాడు.


