కక్ష రాజకీయాల్లో తెలంగాణ తీరు వేరు! | kommineni srinivasa rao comments on Formula E Race Case | Sakshi
Sakshi News home page

కక్ష రాజకీయాల్లో తెలంగాణ తీరు వేరు!

Sep 13 2025 11:51 AM | Updated on Sep 13 2025 11:51 AM

kommineni srinivasa rao comments on Formula E Race Case

తెలంగాణలో ఈ-ఫార్ములా కేసు ఆసక్తికరంగా మారుతోంది. ఈ-ఫార్ములా రేసు సంస్థకు రూ.44 కోట్లు విడుదలకు బాధ్యుడిని తానేనని, అందులో తప్పేమీ లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ కుండబద్దలు కొట్టడం ఒక రకంగా ధైర్యమైన పనే అని చెప్పాలి. అయితే ఈ ఉదంతంలో క్విడ్‌ ప్రో కో జరిగిందని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ చెప్పిన తీరు చూస్తే ఊహజనిత అంశాలపై ఆధారాపడే ఆ నిర్ణయానికి వచ్చారా? అనిపించకమానదు. ఈ వ్యవహారంలో అసలు తప్పు జరిగిందా లేక కేటీఆర్‌పై పనికట్టుకుని కేసు పెట్టారా? అన్నది పరిశీలించాల్సిన విషయం. 

కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ఒక పత్రిక ఫార్ములా ఈ రేస్ స్కామ్‌లో రూ.600 కోట్ల క్విడ్ ప్రోకో అన్న శీర్షిక పెట్టింది. దానిని చూస్తే అంత భారీ మొత్తం బీఆర్‌ఎస్‌కు లభించిందా అనిపిస్తుంది. కాని మొత్తం కథనం చూస్తే ఈ మొత్తం వ్యవహారంలో హెచ్‌ఎండీఏ బోర్డు ఖజానా నుంచి మొత్తం రూ.54.87 కోట్లు దుర్వినియోగం అయ్యాయని, అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కథ ఆగిపోయిందని, లేకుంటే రూ.600 కోట్ల స్కామ్ జరిగేదని ఏసీబీ నివేదిక స్పష్టం చేసిందని ఆ పత్రిక రాసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఇది స్కామ్అని ఏసీబీ కూడా చెప్పేది కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి.

ఈ ఫార్ములా రేసులో రూ.600 కోట్లు ఖర్చు చేసేలా అగ్రిమెంట్స్ చేసుకున్నారని, ఇందుకు పలు రూపాలలో ప్రతిఫలం పొందేలా ప్రణాళిక రూపొందించారని ఏసీబీ తెలిపిందట. మొత్తం రూ.600 కోట్లు ఖర్చు చేస్తే, ఆ మొత్తం అంతా బీఆర్‌ఎస్‌కు ఎలా వెళుతుందో, అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుందో అర్థం కాదు. ఈ ఫార్ములా రేస్ ఒక సీజన్ లో నిర్వహిస్తే అయ్యే  ఖర్చు ఎంత? అందులో  క్విడ్ ప్రోకోకి ఎంత అవకాశం ఉంటుంది అన్నది ఆలోచిస్తే పలు సందేహాలు వస్తాయి. బ్రిటన్‌కు చెందిన ఫార్యులా ఈ ఆపరేషన్స్ , హైదరబాద్‌కు చెందిన గ్రీన్ కో, ఎస్‌నెస్ట్ జెన్  అనే సంస్థల మధ్య  ఈ రేసు నిర్వహణకు 2022లో  త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది, 2023 ఫిబ్రవరిలో సీజన్ తొమ్మిదిగా రేసు నిర్వహించారు. 

ఆ తర్వాత బ్రిటన్ కంపెనీకి, నెక్స్‌ట్‌ జెన్‌ మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ ఫార్ములా సంస్థ తనకు రావల్సిన నిధులు రాకపోవడంతో రేసును నిలిపివేస్తున్నట్లు  ప్రకటించింది. నెక్స్‌ట్‌ జన్ సంస్థకు ఈ రేస్‌లో నష్టం వచ్చిందట. ఆ మీదట ఆ కంపెనీ తదుపరి సీజన్లకు రూ.600 కోట్లు ఖర్చు చేయలేక చేతులెత్తేసింది. దాంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవ తీసుకుని ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థతో మున్సిపల్ శాఖ  మరో ఒప్పందం చేసుకుని  ఈవెంట్ నిర్వహణకు అన్నీ కలిపి రూ.110 కోట్లు చెల్లించడానికి అంగీకరించారు. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఆదేశాలు తీసుకోకుండా  ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు 2023 అక్టోబర్ లో హెచ్‌ఎండీఏ నుంచి కేటీఆర్‌ రూ.45.71 కోట్ల నిధులు విడుదల చేయించారన్నది అభియోగం. ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోలేదన్నది మరో అభియోగం. 

ఫలితంగా హెచ్‌ఎండీఏకి రూ.75 కోట్ల నష్టం వచ్చిందని ఏసీబీ వాదన. దీనిని పరిశీలిస్తే కేటీఆర్‌ తీసుకున్న నిర్ణయాలలో సాంకేతిక లోపాలు ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు నిర్ధిష్ట నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఏ మంత్రి అయినా స్వతంత్రంగా ఇలా చొరవ తీసుకుంటే ఇబ్బందులు వస్తామి, మంత్రిగా కెటిఆర్ ఉద్దేశంలో ఏదైనా లోపం ఉంటే తప్పే అవుతుంది. కాని ఆయన చెబుతున్న దాని ప్రకారం హైదరాబాద్ ఇమేజీని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి ఈ రేస్ ఉపయోగపడుతుంది. అది నిజమా? కాదా? అన్నదానిని ప్రస్తుత ప్రభుత్వం చర్చించిందో లేదో తెలియదు. ఏసీబీ ఆ కోణం జోలికి వెళ్లినట్లు అనిపించదు. కాగా ఈ ఈవెంట్లో బీఆర్‌ఎస్‌కు  భాగస్వామిగా ఉన్న గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థల ద్వారా రూ.41 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు నిధులు వచ్చాయట.ఆ తర్వాత గ్రీన్ కో, ఈ ఫార్ములా సంస్థలు ఈవెంట్ ప్లాన్ చేశాయన్నది అభియోగంగా ఉందని మీడియా వార్తలు సూచిస్తున్నాయి. ఈ గ్రీన్ కో సంస్థ ఈ ఈవెంట్లో భాగస్వాములుగా ఉన్న  ఇతర కంపెనీలతో తమ ఉత్పత్తుల మార్కెటింగ్ ఒప్పందాలు చేసుకుందట.

 గ్రీన్ కో కంపెనీ బీఆర్‌ఎస్‌ కు నిధులు ఇవ్వడం ఎలా తప్పు  అవుతుంది? ఆ మాటకు వస్తే బీజేపీ, కాంగ్రెస్ లకు అనేక కంపెనీలు విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇచ్చాయి. వాటికే పలు ఇతర రాజకీయ పార్టీలకు అదే విధంగా నిధులు అందాయి.  ఆ కంపెనీలు  ప్రభుత్వంలో   కాంట్రాక్టులు పొందుతుంటాయి. ఈ బాండ్లు ఇవ్వకపోయినా కాంట్రాక్టులు చేస్తుంటాయి. . అందులో క్విడ్ ప్రోకో ఉందని ఆరోపిస్తే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లు, ఆయా కంపెనీలతో ఉన్న సంబంధాలపై విచారణ చేయించాలి. అందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమా? పైగా ఎలక్టోరల్ బాండ్స్‌కు, ఈ కేసుకు లింక్ పెట్టిన తీరు కూడా అంత సమర్థనీయంగా లేదు. గ్రీన్ కోకి గత  బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి ఏమైనా భారీ రాయితీ నిబంధనలకు విరుద్దంగా వచ్చిందా అన్నది ఎక్కడా చెప్పినట్లు లేదు.పైగా వారు కూడా ఇందులో ఎంతొకొంత మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది కదా! కేటీఆర్‌ సహా పదిమందిపై ఏసీబీ కేసులు పెట్టింది. 

దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపిన రూ.45.71 కోట్ల నిధులు ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు చేరాయని, ఇందులో అవినీతి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఎవరూ కోరకపోయినా, ఇందులో అవినీతి ఉందా? లేదా? అన్నదానిపై తాను లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్దమని  అని సవాల్ విసిరారు. అలాగే రేవంత్ కూడా సిద్దం అవుతారా అని ప్రశ్నించారు. రేవంత్ గతంలో ఓటుకు  నోటు కేసులో నిందితుడుగా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఈ సవాల్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొరికావా? లేదా? అని ఆయన అడిగారు. రేవంత్ పై అప్పట్లో కేసు  పెట్టినందున ఏదో రకంగా తనపై ఏసీబీతో కేసు  పెట్టించారన్నది కేటీఆర్‌ అభిప్రాయం.. తానే నిధులు విడుదల చేయించానని, హైదరాబాద్ ప్రతిష్ట కోసమే చేశానని కేటీఆర్‌ చెబుతున్నారు. ఒక రాజకీయ నేత ఇలా ధైర్యంగా తానే నిధులు మంజూరు చేశానని చెప్పడం అరుదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేస్‌ను కొనసాగించకపోవడం వల్ల హైదరాబాద్‌కు ఈ రంగంలో వచ్చే అవకాశం ఉన్న వందల కోట్ల పెట్టుబడులు ఆగిపోయాయని ఆయన అంటున్నారు. 

ఈ కోణంలో ప్రభుత్వం జవాబు ఇవ్వడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక పరిణామం ఏమిటంటే కేటీఆర్‌ను, ఆనాటి మున్సిపల్ శాఖ కార్యదర్శిని ,ఇతర అధికారులను  ఏసీబీ విచారించినా, ఎవరిని అరెస్టు చేయలేదు. అంతేకాక ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే  కోర్టులో ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేస్తుందని వార్తలు సూచిస్తున్నాయి. ఇది ఒకరకంగా మంచిదే. ఏదో కేసు  పెట్టి ప్రతిపక్ష  రాజకీయ పార్టీకి చెందిన వారిని, కొందరు అధికారులను ఇష్టం వచ్చినట్లు  అరెస్టు చేయడం కన్నా, విచారణ తర్వాత కోర్టులో నేరుగా ఛార్జిషీట్‌ వేయడం సరైన చర్య. ఈ వార్తలను బట్టి కేటీఆర్‌ను, ఇతరులను  అరెస్టు చేయకపోవచ్చన్న  అభిప్రాయం కలుగుతుంది.ఇందులో కొత్తగా సాక్ష్యాలు పోయేవి కాని, సాక్షులను ప్రభావితం చేసేది కాని ఏమీ ఉండదు. నిధుల మంజూరుకు తానే బాధ్యుడనని కేటీఆర్‌ ఇప్పటికే చెప్పినందున,  అందులోని ఉద్దేశాలపైనే దర్యాప్తు జరిపి ఈ క్విడ్ ప్రోకో అనో, ఎలక్టోరల్ బాండ్లు అనో కేసు పెట్టినట్లు  అనిపిస్తుంది. 

ఏపీలో ఇప్పుడు జరుగుతున్న కక్ష రాజకీయాలు చూస్తున్నవారికి, తెలంగాణలో కూడా కొంతమేర అలాగే సాగుతున్నాయన్న  విమర్శకు  తక్కువ అవకాశం ఇచ్చారనుకోవాలి.  ప్రభుత్వం ఈ కేసు ముందుకు వెళ్లడానికి అనుమతి ఇస్తుందా? దీనికి గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకుంటారా? అన్నది చూడాలి. ప్రభుత్వం నేరుగా అనుమతి ఇచ్చినా కోర్టులో ఇది ఇప్పటికిప్పుడు తేలుతుందని అనుకోజాలం.  ఒక వేళ కోర్టులో ఇందులో తప్పు జరిగిందని తేలితే కేటీఆర్‌కు రాజకీయంగా కొంత నష్టం జరుగుతుంది.కేసు కొట్టివేసే  పరిస్థితి వస్తే రేవంత్ ప్రభుత్వం కావాలని ఈ కేసు పెట్టిందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఏదిఏమైనా ఈ వ్యవహారంలో సాంకేతికంగా కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు కాని అవినీతి రుజువు చేయడం అంత తేలికైన పనికాకపోవచ్చు.


-కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement