
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి సంచిలో మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చనిపోయిన మహిళ బెంగాల్కు చెందిన ప్రమీలగా గుర్తించారు. పది సంవత్సరాల నుంచి భర్తతో దూరంగా ఉంటున్న ప్రమీల.. మరొక వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల బెంగాలీ యువకుడితో ప్రమీలకు పరిచయం కాగా, కొండాపూర్ ప్రాంతంలో అతనితో కలిసి ఉంటుంది.
ప్రమీలను హత్యను చేసిన ఆ యువకుడు గోనె సంచిలో వేసుకొని చర్లపల్లి స్టేషన్కు వచ్చాడు. ఆటోలో మృతదేహాన్ని 37 కిలోమీటర్లు తీసుకొచ్చిన ఆ వ్యక్తి.. చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన పెట్టి వెళ్లిపోయాడు. రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లోకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని అస్సాం వెళ్లే ట్రైన్ ఎక్కి వెళ్లిపోయాడు. హత్యకు సంబంధించి సీసీ ఫుటేజ్ లభ్యమైంది.
కాగా, చర్లపల్లి రైల్వేస్టేషన్ గోడ వద్ద సంచిలో మహిళ మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న ఉదయం 11 గంటల సమయంలో మృతదేహాన్ని ఓ వ్యక్తి ఆటోలో తీసుకొచ్చి పడేసినట్టు స్థానిక ఆటో డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.