
భారతీయ పత్తి రైతులపై 37% పెరిగిన పురుగు మందుల భారం
బీటీ పత్తి రాకతో పురుగు మందుల వాడకం తొలుత తగ్గినా.. తర్వాత తడిసిమోపెడు
అమెరికా వర్సిటీల తాజా అధ్యయనంలో వెల్లడి
సాక్షి, స్పెషల్ డెస్క్ : జన్యుమార్పిడి (జీఎం) పంటలు మన దేశ సాగులోకి వచ్చిన గత ముప్పయ్యేళ్లలో ముందు ఆశించినట్టు, రసాయనిక పురుగు మందుల వాడకం తగ్గకపోగా పెరిగిందా? అంటే అవుననే చెబుతోంది ఓ తాజా అధ్యయనం. అమెరికాలోని అంతర్జాతీయ పత్తి సలహా సంఘం (ఐసీఏసీ), వాషింగ్టన్లోని వర్డ్యూ యూనివర్సిటీ, లీ యూనివర్సిటీ పరిశోధకులు ఉమ్మడిగా ఈ అధ్యయనం చేశారు. మన దేశంలో సాగవుతున్న పత్తి విస్తీర్ణంలో 95% బీటీ పత్తి విత్తనాలనే ఇప్పుడు రైతులు వాడుతున్న సంగతి తెలిసిందే.
బీటీ పత్తి మొక్క విషపూరితంగా ఉంటుంది కాబట్టి.. పురుగు ఆశించిన వెంటనే చనిపోతుందని, తద్వారా పురుగు మందులు వాడాల్సిన అవసరమే తగ్గిపోతుందని చెబుతూ వచ్చారు. అయితే, వాస్తవానికి ఆచరణలో అందుకు భిన్నంగా జరిగిందని ‘జర్నల్ ఆఫ్ అగ్రేరియన్ చేంజ్’లో ఇటీవల ప్రచురితమైన అధ్యయనం తేల్చింది. భారతీయ రైతులు 1990 దశకంలో నాన్బీటీ పత్తి రకాలను సాగు చేసినప్పుడు వాడినప్పటికన్నా బీటీ పత్తి వచ్చిన తర్వాత ఎక్కువగా విష రసాయనాలను వాడాల్సి వస్తోందని గత ముప్పయేళ్ల గణాంకాలను విశ్లేíÙంచిన తర్వాత పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.
పెరిగిన ఖర్చులు
బీటీ పత్తిని 2002లో దేశంలోకి ప్రవేశపెట్టిన తొలిదశలో పురుగుమందుల వాడకం, తద్వారా సాగు ఖర్చు తగ్గింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో సంప్రదాయ పత్తి వంగడాలను వదిలి రైతుల్లో 95% మంది బీటీ పత్తి వైపు మళ్లారు. అయితే, బీటీపత్తిపై పెట్టుకున్న ఆశలు కొద్ది ఏళ్లలోనే తారుమారయ్యాయి. పురుగులు బీటీ పత్తికి అలవాటుపడిపోవటంతో 2010 నాటికే పురుగుమందుల వాడకం మళ్లీ పెరిగింది. ‘2018 నాటికి భారతీయ పత్తి రైతులు బీటీకి ముందుకన్నా 37% ఎక్కువగా పురుగు మందులపై ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది’అని అధ్యయనం తెలిపింది.
ఎక్కువ మంది బీటీ పత్తిని ఏకపంటగా విస్తారంగా సాగు చేస్తుండటంతో త్వరలోనే పురుగులు బీటీ విషానికి తట్టుకునే శక్తిని పెంచుకున్నాయి. పురుగు మందుల వాడకం ఉధృతమైంది. ఈ అధ్యయనంలో భాగస్వాములైన సంస్థల్లో వాషింగ్టన్లోని అంతర్జాతీయ పత్తి సలహా సంఘం (ఐసీఏసీ) ఒకటి. దీని ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ కేశవ్ క్రాంతి తెలుగు వ్యక్తి కావటం విశేషం. ఆయన గతంలో నాగపూర్లోని ఐసీఏఆర్–కేంద్రీయ పత్తి పరిశోధన కేంద్రం (సీఐసీఆర్) సంచాలకుడిగా పనిచేశారు.
రసం పీల్చే పురుగుల విజృంభణ
కాయ తొలిచే పురుగును నియంత్రించే ప్రధాన లక్ష్యంతో బీటీ పత్తి వంగడాలను ప్రవేశపెట్టారు. అయితే, ఆ తర్వాత ఈ పురుగుల ఉధృతి తగ్గినా, అప్పటి వరకు స్వల్పంగా ఉన్న రసం పీల్చే పురుగుల బెడద గతమెన్నడూ ఎరుగనంత తీవ్రమైంది. 2006 నాటికి బీటీ పత్తి సాగు చేయటం దేశవ్యాప్తమైంది. తదనంతర కాలంలో పత్తి పంటలో రసం పీల్చే పురుగుల ఉధృతి ఏటేటా పెరుగుతూ వచ్చింది. 2018 నాటికే భారతీయ పత్తి రైతులపై పురుగుమందుల పిచికారీ ఖర్చు భారీగా పెరిగిందని ఈ అధ్యయనం పేర్కొంది.
అమెరికాలో ఏకు మేకైన కలుపు
అమెరికాలో రైతులు గ్లైఫొసేట్ వంటి కలుపు మందులను చల్లినా తట్టుకొని నిలిచేలా జన్యుమార్పిడి చేసిన పంటల (హెచ్టీ క్రాప్స్)ను విస్తారంగా సాగు చేస్తున్నారు. సోయా, మొక్కజొన్న తదితర పంటలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికాలో హెచ్టీ. సోయా విస్తీర్ణం 1994 లో 92 లక్షల ఎకరాలుండగా, 2018 నాటికి 11.3 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఆ మేరకు గ్లైఫొసేట్ వినియోగం పెరిగింది. గ్లైఫొసేట్ పనితీరు సంక్లిష్ట పద్ధతిలో ఉంటుంది కాబట్టి దీనికి కలుపు మొక్కలు అలవాటు పడి, చనిపోకుండా ఎదురు తిరగవని గ్లైఫొసేట్ తయారు చేసిన కంపెనీ చెబుతూ వచ్చింది.
అయితే, 1998 నాటికే డజన్ల కొద్దీ కలుపు మొక్కలు గ్లైఫొసేట్ చల్లినా చనిపోని పరిస్థితి ఏర్పడింది. దక్షిణ అమెరికాలో జన్యుమారి్పడి పంటలకు ఆదరణ పెరుగుతున్న కొద్దీ రైతులు హెచ్టీ సోయా సాగు విస్తీర్ణాన్ని పెంచారు. కెనడాలోనూ హెచ్టీ మొక్కజొన్న, షుగర్ బీట్, ఆవ పంటల సాగు విస్తీర్ణం తామరతంపరగా విస్తరించింది. ‘ఈ (జన్యుమార్పిడి పంటల) సాంకేతికత చెప్పినట్టు రసాయనిక పురుగుమందుల వినియోగం తొలుత తగ్గినా, తదనంతరం అంతకుముందుకన్నా పెరిగిపోయింది.
ఏదో ఒకే రకం పంటనే పొలం అంతటా సాగు చేసే పారిశ్రామిక సాంద్ర వ్యవసాయ పద్ధతి వల్ల రసాయనిక పురుగుమందులతో పాటు ఎరువుల వాడకం కూడా పెరిగిపోయింది. శక్తివంతమైన రసాయనిక ఎరువులు, పురుగుమందుల కంపెనీల ఒత్తిళ్ల ప్రభావం వల్ల ఆయా దేశాల ప్రభుత్వాలు శిలాజ ఇంధనాల వాడకాన్ని పెంపొందించే జన్యుమార్పిడి పంటలను గట్టిగా ప్రోత్సహిస్తున్నాయి..’అని ఈ అధ్యయనం విశ్లేషించింది. భారత్లోనూ గ్లైఫొసేట్ను తట్టుకునే హెచ్టీ బీటీ పత్తి వంగడాన్ని అనేక లక్షల ఎకరాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, గత కొన్ని సంవత్సరాలుగా అనధికారికంగా సాగు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనూ పెరిగిన గ్లైఫొసేట్ వాడకం
తెలంగాణ, ఏపీలోకూడా హెర్బిసైడ్ టాలరెంట్ పత్తి విత్తనాల ఉపయోగం వల్ల గ్లైఫొసేట్ వాడకం పెరిగింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కలు పు మందును రెండు, మూడు సంవత్సరాలు 60 రోజుల పాటు నిషేధించాయి. తెలంగాణలో పత్తి విస్తీర్ణం పెరిగింది. గులాబీ పురుగులు మరింత ఉధృతం కావటంతో ప్రమాదకర రసాయనాల వాడకం ఎక్కువైంది. సాగు ఖర్చు పెరిగింది. – డా. దొంతి నరసింహారెడ్డి, విధాన విశ్లేషకుడు, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా, హైదరాబాద్