Heavy Rains in Telangana: తెలంగాణకు నాలుగు రోజులపాటు అతిభారీ వర్షాల హెచ్చరిక.. ఏపీలోనూ వానలు

IMD issued Heavy Rains warning For Telangana Normal Rains Alert AP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలతో పాటు సంబంధిత విభాగాల అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు పడే అవకాశం ఉంది.

► గత వర్షాలు-వరదల నుంచి కోలుకుంటున్న టైంలోనే హఠాత్తుగా భారీ వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో శుక్రవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో.. నగరం బీభత్సంగా మారింది.

► తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ కాగా, వరినాట్ల పనులకు వెళ్లే కూలీలు పరిస్థితిని చూసుకుని ముందుకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. 

► ఇక ఏపీలోనూ పలు ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉండడం రాష్ట్ర విపత్తు శాఖ అప్రమత్తం అయ్యింది.

తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు.. పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.

నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను జూలై 26వ తేదీ వరకు ప్రకటించింది.

చాలా ప్రాంతాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండగా.. రహదారులతో పాటు రోడ్లు కాలనీలు సైతం మునిగిపోయాయి.

► రోడ్లపై నీళ్లు నిలిచిపోవడం, మ్యాన్‌హోల్స్ తెరిచి ఉండడం, ట్రాఫిక్‌ జామ్‌ సమస్య, అతివేగంతో వెళ్లి రోడ్లపై జారి పడే ప్రమాదం, కరెంట్‌ ప్రమాదాలు.. ఇలా పలు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు సంబంధిత అధికారులు. 

జడివానలోనూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటూ.. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూస్తున్నారు.

వరంగల్‌లో విషాదం
వరంగల్‌: వర్షానికి మండీబజార్‌లో ఓ పాత భవనం కూలిపోయింది. పాత భవనం కూలి.. పక్కనే ఉన్న షెడ్‌పై పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో మహిళ గాయపడగా.. చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 

► తెలంగాణలో పలు జిల్లాల్లో 20 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదు అయ్యింది. మెదక్‌, జనగామ, మహబూబాబాద్‌, సంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. మెదక్‌ పాతూరులో అత్యధికంగా 26 సెంమీ వర్షపాతం నమోదు అయ్యింది. 

► యాదాద్రి.. గుండాల-నూనెగూడెం బ్రిడ్జి మీద నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిపేశారు అధికారులు. ఆలేరు మండలంలో రత్నవాగు ప్రవాహం ఎక్కువ అవుతోంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

► సూర్యాపేట జి.కొత్తపల్లి వద్ద పాలేరు వాగు ప్రవాహం ఉధృతంగా ఉంది. వాగు అవతలి 22 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకుపోయి.. రాత్రంతా పొలం గట్లపైనే గడిపారు. పడవ సాయంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వాళ్లందరినీ రక్షించారు. ఇక జనగామ చీటూరు-గోపు వాగులో చిక్కుకున్న 14 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ఇదీ చదవండి: మళ్లీ ముసురుకుంది.. అలర్ట్‌గా ఉండండి- సీఎం కేసీఆర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top