గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే.. కవిత | I will hand over every single inch of the land to the government | Sakshi
Sakshi News home page

గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే.. కవిత

Sep 16 2026 9:33 PM | Updated on Sep 16 2026 9:34 PM

 I will hand over every single inch of the land to the government

సాక్షి,హైదరాబాద్ :  ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న భూముల కన్నా గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. అసెంబ్లీలో 22ఏపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టుగా ప్రస్తావించిన అంశంపై ‘‘ఎక్స్’’ వేదికగా కవిత స్పందించారు. అసెంబ్లీలో ఈరోజు సీఎం ఎవరెవరి పేర్లు ప్రస్తావించి వారికి ఎక్కువ భూములు ఉన్నట్టుగా చెప్పారో వారందరిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

సీఎం అసెంబ్లీలో ఎవరెవరికి అక్రమ భూములు ఉన్నట్టు చెప్పారో వారందరిపై సరైన విచారణ జరిపిస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. అసెంబ్లీలో ఈ రోజు సీఎం చదివిన భూముల చిట్టాలో నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆమె ఎక్స్ లో  "సీఎం ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించిన గుంట నక్క, కేసీఆర్ గారి ఫాం హౌస్ లో ఉండే సీఎం గూఢచారి సహా నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి సహా అందరి భూములపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలి"  అని డిమాండ్ చేశారు.

తాను ఎప్పటి నుంచో చెప్తున్నట్టుగా గుంపు మేస్త్రీ - గుంటనక్క కలిసే ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు. వారిద్దరూ కలిసే ఈ డ్రామాలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. నిబంధనలు అతిక్రమించి తనకు గజం భూమి ఎక్కువగా ఉన్నా.. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న భూమి కన్నా గజం అదనంగా ఉన్నట్టు తేలినా ఆ భూములు ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నానని కవిత కుండబద్దలు కొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement