సాక్షి, సంగారెడ్డి: అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో శనివారం చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా స్పష్టత ఇచ్చింది. కూల్చివేతలకు కాసేపు విరామం మాత్రమే ఇచ్చామని.. ప్రచారాలు నమ్మవద్దని స్పష్టం చేసింది.

అమీన్పూర్ మండలంలో 1,260 ఎకరాల భూములను పరిరక్షించేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. ఇప్పటికే సగం భూముల్లో అక్రమ కట్టడాలు వెలిశాయని.. మిగతా భూముల్ని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ క్రమంలో ఐలాపూర్, కృష్ణారెడ్డిపేట పరిసరాల్లోని వందల ఎకరాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించింది. ఏ లాయర్కు చెందిన ఫామ్హౌజ్తో పాటు పలు నిర్మాణాలు ఇందులో ఉన్నాయి. కూల్చివేత తర్వాత చుట్టూరా.. ఫెన్సింగ్లు ఏర్పాటు చేయించింది. అయితే.. అక్కడి అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్నవారికి ఖాళీ చేసేందుకు మాత్రం కాస్త సమయం ఇచ్చింది.

కూల్చివేతలకు ముందు మున్సిపాలిటీ అధికారులు నీరు, కరెంట్ను కట్ చేశారు. తమకు ముందస్తు సమాచారం లేదని కొందరు నివాసితులు హైడ్రా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే తాము బిల్డర్స్కు సమాచారం ఇచ్చామని అధికారులు తెలిపారు. తమకు ఏం తెలియదని కొందరు వాపోగా.. కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చి ఖాళీ చేయాలని సూచించారు. దీంతో సామాన్లు సర్దేసుకుని బయటకు వెళ్లిపోతున్నారు. కాసేపు విరామం తర్వాత కూల్చివేతలు కొనసాగనున్నాయి.


