సాక్షి, హైదరాబాద్: గత మార్చిలోనే టేకోవర్ ప్రక్రియను ముగించి ఏప్రిల్ మొదటి వారం నుంచే హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) చేతికొస్తుందనుకున్న మెట్రో మొదటి దశ టేకోవర్ ఇప్పటికీ అతీగతీ లేకుండాపోయింది. ఎల్అండ్టీ సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, తదితర అంశాలతో పాటు, వ్యాపార సంస్థల నిర్వహణపై స్పష్టత రావాల్సి ఉంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) రుణాలను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఎల్అండ్టీ సంస్థతో తేల్చుకోవాల్సిన మరికొన్ని అంశాలు ఉన్నాయి.
మెట్రో కోచ్లు, ట్రాక్లు, ఇతర వ్యవస్థలకు ఎల్అండ్టీ అవసరమైన మరమ్మతులు చేసి అందజేస్తుందా? లేక.. ఉన్నది ఉన్నట్లుగా బదిలీ చేస్తారా? అనే అంశం తేల్చుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎల్అండ్టీ సంస్థ కార్మికశాఖకు చెల్లించాల్సిన సెస్ పెండింగ్లోనే ఉంది. వ్యాపార ప్రకటనలపై జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన పన్నులు కూడా పెండింగ్ జాబితాలోనే ఉన్నాయి. బదిలీలు, చెల్లింపులు, బదలాయింపులకు మరికొంత సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.


