రూ.4.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం | Huge amount of Cannabis seized | Sakshi
Sakshi News home page

రూ.4.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

Aug 6 2025 4:50 AM | Updated on Aug 6 2025 4:50 AM

Huge amount of Cannabis seized

మల్కన్‌గిరి నుంచి ఉత్తరప్రదేశ్‌కుతరలిస్తున్న ముఠా 

శంషాబాద్‌ వద్ద ఇద్దరిని అరెస్ట్‌ చేసిన ఈగల్‌ టీమ్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న 847 కిలోల హైగ్రేడ్‌ (అత్యధిక నాణ్యత) గంజాయిని ఈగల్‌ (ఎలైట్‌ యాక్షన్‌ గ్రూప్‌ ఫర్‌ డ్రగ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) టీమ్‌ స్వాదీనం చేసుకుంది. పట్టుబడిన గంజాయి విలువ రూ.4.2 కోట్లు ఉంటుందని ఈగల్‌ టీం డైరెక్టర్‌ సందీప్‌శాండిల్య తెలిపారు. 

ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి ఉత్తర ప్రదేశ్‌కు భారీ మొత్తంలో గంజాయి సరఫరా చేస్తున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం ఆర్‌ఎన్‌సీసీ (రీజినల్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ సెల్‌), ఈగల్‌ టీమ్‌ శంషాబాద్‌ సమీపంలోని తొండపల్లి వద్ద అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని సోమవారం సాయంత్రం ఐదు గంటలకు అడ్డగించింది. 

సోదాలు చేయగా, పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. వాహనంలో ఉన్న మల్కన్‌గిరికి చెందిన ఖిలాధన, రాజేందర్‌ బజింగ్‌లను అరెస్టు చేశారు. ఈ ముఠాతో సంబంధమున్న రమేశ్‌ సుక్రి, జగదీశ్‌ కులదీప్, షిబో అలియాస్‌ షిబా, బసు, షఫీక్‌ అలియాస్‌ షఫీల కోసం గాలిస్తున్నారు.  

గంజాయిని సరిహద్దు దాటించడంలో ఆ ఇద్దరూ దిట్ట  
మల్కన్‌గిరికి చెందిన ఖిలాధన, రాజేందర్‌ బజింగ్‌లు గంజాయిని రాష్ట్ర సరిహద్దులు దాటించడంలో దిట్ట అని ఈగల్‌ డైరెక్టర్‌ సందీప్‌శాండిల్య తెలిపారు. ఖిలాధన 2019లో 20 కిలోల గంజాయి రవాణా చేస్తూ ఏపీలోని డొంకరాయి వద్ద పోలీసులకు పట్టుబడి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో 4 నెలలు ఉన్నాడు. బెయిల్‌పై బయటకు వచి్చన తర్వాతా ఉత్తరప్రదేశ్‌కు ఈ ఏడాదిలో 350 కిలోలు, 500 కిలోలు, 600 కిలోల చొప్పున గంజాయి తరలించిన చరిత్ర ఉంది. పోలీసులకు చిక్కకుండా స్థానిక రోడ్ల మీదుగా దూర ప్రాంతాలకు డ్రైవింగ్‌ చేయడంలో నిపుణుడు.  

» మరో నిందితుడు రాజేందర్‌ బజింగ్‌ 2023లో 150 కిలోల గంజాయి రవాణా చేస్తూ ఏపీలోని నర్సీపట్నం పోలీసులకు చిక్కాడు. విశాఖ సెంట్రల్‌ జైలు నుంచి 10 నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. గ్రామీణ ప్రత్యామ్నాయ రహదారుల గురించి లోతైన అవగాహన ఉంది.  

» పెద్ద మొత్తంలో గంజాయి పట్టివేతలో కీలకంగా వ్యవహరించిన ఆర్‌ఎన్‌సీసీ ఖమ్మం బృందం డీఎస్పీ సీహెచ్‌ శ్రీధర్, ఇన్‌స్పెక్టర్‌ విజయ్, ఎస్సై రవిప్రసాద్, సైబరాబాద్‌ నార్కోటిక్స్‌ డీఎస్పీ హరీశ్‌చంద్రారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు రమేశ్‌రెడ్డి,రామునాయక్, సిబ్బందిని ఈగల్‌ డైరెక్టర్‌ సందీప్‌శాండిల్య అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement