హైదరాబాద్: హైదరాబాద్తో సహా తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం పడింది. ఈరోజు(సోమవారం, మే 25వ తేదీ) మధ్యాహ్నం వరకూ ఎండతో అల్లాడిన ప్రజల్ని వర్షం పలకరించింది. హైదరాబాద్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, ఎల్బీనగర్, వనస్థలిపురం, చింతల్, బాలానగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెంట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని చోట్ల మాదిరిగా వర్షం పడగా, అక్కడక్కడా భారీగానే వర్షం పడింది. ప్రధానంగా కోఠిలో భారీ వర్షం పడింది.
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎల్లారెడ్డి మండలం అల్మాస్పూర్లో గాలివాన బీభత్సానికి వర్షపు నీరు కల్లాల్లోకి చేరింది. దాంతో ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి బీభత్సంతో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఓ చెట్టు కారుపై పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. గుంతపల్లి చెరువు తండాలో పిడుగుపడింది.
మెదక్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షానికి మెదక్ మండలంలో ధాన్యం తడిసిపోయింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ గ్రామంలో ఈదురు గాలికి పశువుల పాక కూలింది. లక్ష్మయ్య అనే గొర్లె కాపరి మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వరి కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం తడిచిపోయింది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆవేదన చెందుతున్నారు.


