
హైదరాబాద్: నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా వర్షం తెరిపి ఇవ్వడంతో హైదరాబాద్ వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సోమవారం సాయంత్రం మళ్లీ భారీ వర్షం రావడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంజరాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి,కోఠి, దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది దాంతో ఆఫీస్ల నుంచి ఇంటికి వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. రోడ్లు జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్ వెల్లడించారు. రెండు గంటలపాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఆయన వాహనదారులకు సూచించారు. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, నాంపల్లి 9.2 సెం.మీ, ఎల్బీ స్టేడియం 8.6 సెం.మీ , ఖైరతాబాద్ 7.5 సెం.మీ, సరూర్ నగర్ 7.2 సెం.మీ , రాజేంద్రనగర్ 6.5 సెం.మీ , మెహిదీపట్నం 4.5 సెం.మీ , హయత్నగర్ 3.4 సెం.మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.