సాక్షి, హైదరాబాద్: తూర్పు, ఉత్తర తెలంగాణకు వడగాల్పుల హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. వచ్చే రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వడదెబ్బతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 19 మంది మృతిచెందారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు తాజా వాతావరణం ఊరటనిచ్చింది. చాలాచోట్ల సాధారణంకంటే 2 నుంచి 6 డిగ్రీల మేర తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. గురువారం ఉత్తర, తూర్పు జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
బుధవారం తూర్పు జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిశాయి. గురు, శుక్రవారాల్లో కూడా తూర్పు, ఉత్తర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర బిహార్ పరిసర ప్రాంతాల నుంచి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ల మీదుగా దక్షిణ తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 42.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 21.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.
కాగా, ఏపీలో రాగల మూడు గంటల్లో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 40 నుండి 50 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు . ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విజ్ఞప్తి చేశారు.


