పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న శివధర్రెడ్డి
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కీలకంగా పనిచేశారు
శివధర్రెడ్డి వీడ్కోలు కార్యక్రమంలో సీవీ ఆనంద్
సహకరించిన అందరికీ కృతజ్ఞతలు: డీజీపీ శివధర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారిగా బి.శివధర్రెడ్డి అందించిన సేవలు విశిష్టమైనవని డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ కొనియాడారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కీలక బాధ్యతల్లో ఆయన పనిచేశారన్నారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో పనిచేసిన నాటి రోజులు గుర్తు చేసుకున్నారు. గురువారం శివధర్రెడ్డి డీజీపీగా పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా పోలీస్ అకాడమీలో గౌరవసూచకంగా ప్రత్యేక పరేడ్ కార్య క్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ, పోలీస్ అధికారిగా 32 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజ లకు అమూల్యమైన సేవలందించారన్నారు. నక్సల్ సమ స్యను ఎదుర్కోవడంలో జిల్లా ఎస్పీగా, ఎస్ఐబీ అధికారిగా కీలకపాత్ర వహించారని చెప్పారు. మావోయిస్టుల ఎన్కౌంటర్లతోపాటు లొంగుబాట్లలోనూ కీలకంగా ఉన్నారన్నారు. సాంకేతికతను వాడటంలో తెలంగాణ పోలీసు దేశంలో ముందంజలో ఉందన్నారు.
ఇప్పుడు డ్రగ్స్, సైబర్నేరాలు, ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని, వీటిని ఎదుర్కొనేందుకు పోలీస్శాఖ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ, వృత్తిగత జీవితంలో ప్రోత్సహించిన, తన విజయాల్లో భాగమైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమం తర్వాత పోలీస్, ప్రజలకు మధ్య వచ్చిన అంతరాన్ని తగ్గించేందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం తీసుకున్నామని గుర్తు చేశారు. యువ అధికారులు పోలీస్శాఖకు పేరు తేవాలని సూచించారు.
సాదరంగా వీడ్కోలు
రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం వేదికగా నిర్వహించిన వీడ్కోలు వేడుక ఆత్మీయతతో కూడిన వాతావరణంలో సాగింది. కార్యక్రమ ఆరంభంలో శివధర్రెడ్డి తన బాధ్య తలను శాంతిభద్రతల డీజీ మహేశ్ ఎం. భగవత్కు అప్ప గించారు. నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించే వరకు, ఇన్చార్జి డీజీపీగా మహేశ్ భగవత్ వ్యవహరించనున్నారు.
అధికారిక బదిలీ ప్రక్రియ అనంతరం, వీడ్కోలు పలికేందుకు పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో నిలబడి, అందరికీ చేతులు ఊపుతూ అభివాదం చేశారు. పోలీసు సంప్రదాయం ప్రకారం ఐపీఎస్ అధికారులు తాళ్లతో ఆ వాహనాన్ని లాగుతూ కార్యాలయ ప్రధాన ద్వారం వరకు సాగనంపారు. కార్యక్రమంలో టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు, ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయకుమార్తో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.


