సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణకుమారి(77) కన్నుమూశారు. అనారోగ్యంతో ఈరోజు(బుధవారం) ఉదయం సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ పరమపదించారు. దీంతో గవర్నర్ తమిళిసై కుటుంబం తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు.
సందర్శకుల కోసం.. ఈ రోజు మధ్యాహ్నం వరకు పార్థివ దేహన్ని రాజ్భవన్లో ఉంచుతారు. ఆ తర్వాత అంత్యక్రియల కోసం చెన్నై తరలించనున్నారు. మంత్రి కే. తారక రామరావు ఉదయం 9-15 లకు గవర్నర్ తమిళిసైని కలిసి ఆమె మాతృమూర్తికి నివాళి అర్పించనున్నారు.
గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ మాతృశ్రీ కృష్ణ కుమారి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు.
ఏపీ గవర్నర్ సంతాపం..
తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ మాతృశ్రీ కృష్ణ కుమారి ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా, గవర్నర్ తమిళిసై మాతృమూర్తి మృతిపట్ల ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.