హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. గాంధీ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ కోర్సు చదువుతున్న పల్లవిగౌడ్ (19) అనే విద్యార్థిని శస్త్రచికిత్స అనంతరం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మరణించిందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో గాంధీ మార్చురీ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బాధితులు, చిలకలగూడ పోలీసులు తెలిపిన మేరకు..
జియాగూడకు చెందిన పల్లవి గౌడ్ కుడిఛాతీపై వాపు (గడ్డ) రావడంతో ఈనెల 16న గాంధీ ఆస్పత్రికి వచి్చంది. చిన్నపాటి సర్జరీ చేయాలని వైద్యులు చెప్పడంతో 18న అడ్మిట్ కాగా..19న సర్జరీ చేశారు. మరుసటి రోజు వైద్యులు పరీక్షించి మరోసారి సర్జరీ (రీఎక్స్ప్లొరేషన్) చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది.
ఇదిలా ఉండగా.. సీనియర్ వైద్యులతో కాకుండా జూనియర్లతో సర్జరీ చేయించి తమ కుమార్తె ప్రాణాలపై ప్రయోగాలు చేశారని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతురాలి తండ్రి వెంకటే‹Ùగౌడ్ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క బాధితులను పరామర్శించి, ప్రభుత్వపరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ముగ్గురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ
పల్లవి మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని గాంధీ సూపరింటెండెంట్ ప్రొ.వాణి స్పష్టం చేశారు. పల్లవికి సర్జరీ అనంతరం రక్తపుగడ్డలను తొలగించామని తెలిపారు. ఆ తర్వాత బీపీ పడిపోవడం, ఊపిరితిత్తుల సమస్యల కారణంగా వెంటిలేటర్పై ఉంచి అత్యుత్తమ వైద్యం అందించామని.. అయినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ ఘటనపై ముగ్గురు వైద్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.


