భారీ రుణభారంతో మొదలైన 2026–27 ఆర్థిక సంవత్సరం
మొత్తం రాబడులు రూ. 22,392 కోట్లు... అందులో అప్పులే రూ. 11,413 కోట్లు
ఏప్రిల్–2026 ఆదాయ, వ్యయాలను వెల్లడించిన కాగ్
సాక్షి, హైదరాబాద్: కొత్త ఆర్థిక సంవత్సరం అప్పుల భారంతో మొదలైంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను మొదటి నెల ఏప్రిల్లో ఖజానాకు సమకూరిన మొత్తం రాబడుల్లో సగం అప్పులే ఉన్నాయి. ఏప్రిల్కు సంబంధించి మొత్తం రాబడులు రూ. 22,392.28 కోట్లు రాగా అందులో అప్పులు రూ. 11,413.93 కోట్లు ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. ఆ నెలలో మొత్తం వ్య యాన్ని రూ. 21,472.31 కోట్లుగా తేల్చింది.
పన్ను ఆదాయం రూ. 10,598 కోట్లే
ఆర్థిక సంవత్సరం ప్రారంభ మాసంలో రాష్ట్ర సొంత పన్నుల రాబడి కొద్దిగా తగ్గినట్లు కాగ్ లెక్కలను పరిశీలిస్తే అర్థమవుతోంది. పన్ను ఆదాయం రూపంలో ఏప్రిల్లో సమకూరింది రూ. 10,598.33 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అందులో జీఎస్టీ రూపంలో రూ. 3,155 కోట్లు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 1,413 కోట్లు, అమ్మకపు పన్ను పద్దు కింద రూ. 2,923 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం కింద రూ. 1,445 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో రూ. 1,260 కోట్లు సమకూరాయి. ఇతర పన్నుల కింద రూ. 400 కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా రూ. 359.51 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 16 కోట్లు కలిపి మొత్తం రెవెన్యూ ఆదాయం రూ. 11,147 కోట్లు వచ్చాయి.
ఖర్చు ఆ మేరకు: ఆదాయం వచ్చిన మేరకు తొలి నెలలో ఖర్చు కూడా జరిగిందని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. రెవెన్యూ పద్దు కింద రూ. 6,080 కోట్లు, వడ్డీలకు చెల్లింపుల కింద రూ. 2,350 కోట్లు, వేతనాల కోసం రూ. 4,449 కోట్లు, పింఛన్ల కోసం రూ. 1,893 కోట్లు, సబ్సిడీల కింద రూ. 4,727 కోట్లు ఖర్చవగా మూలధన వ్యయం కింద రూ. 1,891.57 కోట్లు ఖర్చయ్యాయి. అప్పులకు వడ్డీల కింద చెల్లించిన దాని కంటే మూలధనం కింద తక్కువ వ్యయం కావడం గమనార్హం. ఇక రెవెన్యూ లోటు రూ. 8,526 కోట్లుగా నమోదవగా ఆర్థిక సంవత్సరం తొలి మాసంలోనే ద్రవ్యలోటు రూ. 11,413 కోట్లుగా నమోదు కావడం గమనార్హం.


