
జనగామ: జిల్లాలోని పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ శ్రేణులు కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలనే ప్రయత్నం చేస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. పాత నమూనా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
దాంతో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్-బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడ భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో పాలకుర్తిలో పోలీసులను మోహరించి పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య కూడా తోపులాట చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెపట్టాయి. దాంతో పోలీసులను భారీగా మోహరించారు.