సీసీఎంబీ, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సంయుక్త అధ్యయనంలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాల్లో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ (మందు పనిచేయని లక్షణం) వేగంగా పెరుగుతున్నట్లు సీసీఎంబీ, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రోగుల నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా 45 శాతం కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఒకటి కంటే ఎక్కువ యాంటీబయోటిక్స్కు స్పందించకుండా ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితి కారణంగా వైద్యులు ముందుగా వేసుకున్న అంచనాల ఆధారంగా మందులు ఇవ్వడం (ఎంపిరికల్ ట్రీట్మెంట్) సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చని నిపుణులు హెచ్చరించారు.
అందుకే మైక్రోబయాలజీ పరీక్షల ఆధారంగా చికిత్స అందించడం అత్యవసరమని సూచించారు. కంటి ఇన్ఫెక్షన్లు కేవలం కంటికే పరిమితం కాకుండా పరిసరాల్లో ఉన్న సూక్ష్మజీవాల పరిస్థితిని కూడా ప్రతిబింబిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. కాబట్టి యాంటీబయోటిక్స్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఆసుపత్రుల్లో ఆధునిక పరీక్షా విధానాలను పెంపొందించడం అవసరమని సూచించారు. ప్రత్యేకంగా తీవ్రమైన కంటి ఇన్ఫెక్షన్లలో సరైన పరీక్షలు చేయకుండా మందులు వాడితే సమస్య మరింత పెరగొచ్చని పేర్కొన్నారు.


