హైటెక్‌ సెక్స్‌ రాకెట్‌ 

Cyberabad Police Caught High-tech sex racket gang in Hyderabad - Sakshi

హైదరాబాద్‌ కేంద్రంగా ఏళ్లుగా దందా 

ముఠాకు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌..

14,190 మంది యువతులతో వ్యాపారం

ముఠా గుట్టు రట్టు చేసిన సైబరాబాద్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌/హఫీజ్‌పేట్‌: హైటెక్‌ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయింది. ఉద్యోగాల పేరుతో దేశ, విదేశీ మహిళలను ఆకర్షించి, బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. పలు వెబ్‌సైట్లు, వాట్సాప్‌ గ్రూపుల్లో మొత్తం 14,190 మంది యువతుల ఫొటోలు, వివరాలు పెట్టి.. కాల్‌సెంటర్ల ద్వారా విటులను ఆకర్షిస్తున్న ఈ గ్యాంగ్‌.. హైదరాబాద్‌ కేంద్రంగా ఎన్నో ఏళ్లుగా ఈ దందా సాగిస్తోంది.

ఈ కేసుకు సంబంధించి గచ్చిబౌలిలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌ మేనేజర్‌ రాకేష్‌ సహా 18 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచారం నిర్వహించడంతో పాటు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఈ ముఠా వివరాలను ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ సేఫ్టీ వింగ్‌ డీసీపీ దార కవితతో కలిసి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మంగళవారం మీడియాకు వెల్లడించారు.
వివరాలు వెల్లడిస్తున్న  కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, డీసీపీ కవిత 

హోటల్‌ వర్కర్‌గా పనిచేస్తూ వ్యభిచారం దందా వైపు..
బేగంపేటకు చెందిన మహ్మద్‌ సల్మాన్‌ ఖాన్‌ అలియాస్‌ సమీర్‌ 2016–19 మధ్యకాలంలో సోమాజిగూడలోని కత్రియా, పార్క్‌ హోటళ్లలో పనిచేశాడు. అప్పట్లో వ్యభిచార ముఠా బాధితురాలు ఒకరు ఓ హోటల్లో బస చేయడం గమనించిన సమీర్‌..సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రగ్స్‌ అలవాటు ఉన్న సమీర్‌కు మరో డ్రగ్‌ వినియోగదారుడు, మాసాబ్‌ట్యాంక్‌కు చెందిన మహ్మద్‌ అదీమ్‌ అలియాస్‌ అర్నవ్‌తో పరిచయం ఏర్పడింది.

ఇద్దరూ కలిసి 2016 నుంచి సోమాజిగూడ కేంద్రంగా వ్యభిచారం నిర్వహించడం మొదలుపెట్టారు. వీరితో పాటు మొత్తం 17 మంది ప్రధాన ఆర్గనైజర్లు వేర్వేరు రాష్ట్రాలలో వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా దందా సాగిస్తున్నారు. ఒక్కో వాట్సాప్‌ గ్రూప్‌లో 300 మంది ఆర్గనైజర్లు సభ్యులుగా ఉన్నారు. వీటిద్వారా మొత్తం 14,190 మంది యువతులతో వ్యభిచారం సాగిస్తున్నారు.

ముఠా దొరికింది ఇలా...
ఇటీవల వ్యభిచారం చేస్తూ పట్టుబడిన యువతులను విచారించిన పోలీసులు.. గత నెల 15న బేగంపేటకు చెందిన సల్మాన్, పీఅండ్‌టీ సన్‌సిటీకి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ కరీంలను అదుపులోకి తీసుకున్నారు. వీరి విచారణలో దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఉన్న ఆర్గనైజర్ల జాబితా వెలుగులోకి వచ్చింది. దీంతో యాంటీ హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ టీమ్‌తో బృందాన్ని ఏర్పాటు చేసి.. సల్మాన్, కరీంతో పాటు పలువురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు.

వీరిలో రాడిసన్‌ బ్లూ హోటల్‌ మేనేజర్‌ రాకేష్‌తో పాటు మాసాబ్‌ట్యాంక్‌కు చెందిన అర్నవ్, టోలిచౌకికి చెందిన మహ్మద్‌ సమీర్, సోమాజిగూడకు చెందిన హర్బిందర్‌ కౌర్‌ అలియాస్‌ సిమ్రాన్‌ కౌర్, ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన యరసారి జోగేశ్వర్‌రావు, బాలానగర్‌కు చెందిన నడింపల్లి సాయిబాబా గౌడ్, సన్‌సిటీకి చెందిన శైలేంద్ర ప్రసాద్, యూసుఫ్‌గూడకు చెందిన మహ్మద్‌ అఫ్సర్, కూకట్‌పల్లికి చెందిన పసుపులేటి గంగాధరి, ఆసిఫ్‌నగర్‌కు చెందిన రిషీ, బీరంగూడకు చెందిన కోడి శ్రీనివాస్, గోల్కొండకు చెందిన అలీసామ్, అనంతపురానికి చెందిన మహ్మద్‌ ఫయాజ్, కర్ణాటకకు చెందిన విష్ణు, సాయి సుధీర్, ఒడిశాకు చెందిన సర్భేశ్వర్‌ రౌట్‌లు ఉన్నారు.

వీరు సైబరాబాద్, హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్లలో 39 కేసులలో నిందితులుగా ఉన్నారు. తాజాగా వీరిపై గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి ఠాణాలలో ఐదు కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ.95 వేల నగదుతో పాటు 34 సెల్‌ఫోన్లు, 3 కార్లు, ల్యాప్‌టాప్, 2.5 గ్రాముల ఎండీఎంఏ (మాదకద్రవ్యం)ను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ పాస్‌పోర్ట్‌లు, ఆధార్‌లు..
విటులతో సంప్రదింపుల కోసం నిర్వాహకులు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరుల్లో కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కోల్‌కతా, అసోం రాష్ట్రాల యువతులతో పాటు థాయ్‌లాండ్, నేపాల్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, రష్యా దేశాల మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విదేశీ మహిళలకు నకిలీ పాస్‌పోర్టులు, ఆధార్‌ కార్డులు సృష్టించి వివిధ నగరాలకు తరలిస్తున్నారు. 

దందా సాగుతోందిలా..
ఆర్గనైజర్ల కింద ఉండే బ్రోకర్లు ఉద్యోగా లిప్పిస్తామంటూ పేద మహిళలకు ఎర వేస్తా రు. వారి వివరాలను సేకరిస్తారు. ఆపై బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతా రు. విటులను ఆకర్షించేందుకు బాధిత అమ్మాయిల ఫొటోలు, ఇతర వివరాలు దేశవ్యాప్తంగా ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లలో పెడతారు. లొకాంటో, స్కోక్కా, మైహెవెన్‌మోడల్స్‌.కామ్‌ నటాషారాయ్‌. ఇన్‌ వంటి కాల్‌గర్ల్స్‌ వెబ్‌సైట్లలోనూ వాటిని పోస్ట్‌ చేస్తారు.

వీటిని చూసిన విటులు తమకు నచ్చిన యు వతుల కోసం అందులోని వాట్సాప్‌ నంబ ర్లకు ఫోన్‌ చేస్తారు. కాల్‌ సెంటర్ల ప్రతినిధు లు అమ్మాయిల వివరాలు, రేట్లను తెలిపి.. ఏ హోటల్‌కు వెళ్లాలో సూచిస్తారు. ఓకే అనుకున్నాక ఆ ప్రతినిధి విటుడిని ఆర్గనైజర్‌తో కాన్ఫరెన్స్‌ కాల్‌లో మాట్లాడిస్తారు. డీల్‌ కుది రాక స్టార్‌ హోటళ్లలో గదులు, ఓయో రూ మ్స్, అవసరమైతే విమాన టికెట్లు బుక్‌ చేస్తారు.

విటులు నగదు లేదా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయాలి. అందులో 30% యువతికి, 35% అమ్మాయిల ఫొటోలను ప్రచారం చేసేవారికి, కాల్‌సెంటర్‌ ప్రతినిధులకు ఇస్తా రు. 35 శాతం నిర్వాహకులు వాటాలుగా పంచుకుంటారు. ఈ దందాలో ఒక్కో ఆర్గనైజర్‌ రూ.40 లక్షల వరకు ఆదాయం ఆర్జించినట్లు డీసీపీ కవిత తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top