‘హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నాం’ | CM Revanths review of the power sector | Sakshi
Sakshi News home page

‘హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నాం’

May 16 2025 3:09 PM | Updated on May 16 2025 3:53 PM

 CM Revanths review of the power sector

విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష

హైదరాబాద్: వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈరోజు(శుక్రవారం) విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ ఏడాది అత్యధికంగా 17, 162 మెగా వాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందన్నారు.

2025- 26 లో 18,138 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతుందని, 2034..35 నాటికి 31,808 మెగావాట్ల కు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుందన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్లు సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు.

ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల  ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి. రైల్వే లైన్లు, మెట్రో , ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త గా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్  అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి. భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్‌గా మారబోతోంది.

హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్ లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఎ తో సమన్వయం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలి. విద్యుత్ లైన్ల ఆధునీకరణ పైన దృష్టి సారించాలి. ఫ్యూచర్ సీటీ లో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీలులేదు..

హై టెన్షన్ లైన్ల ను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలి. సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ను తీసుకురావాలి. 160 కిలో మీటర్ల అవుటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలి. జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్ పాత్ లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement