మెట్రో ఫేజ్‌–2కు ఆమోదం తెలపండి | CM Revanth Reddy Met Manohar Lal Khattar For Hyderabad Metro | Sakshi
Sakshi News home page

మెట్రో ఫేజ్‌–2కు ఆమోదం తెలపండి

May 7 2026 2:44 AM | Updated on May 7 2026 2:44 AM

CM Revanth Reddy Met Manohar Lal Khattar For Hyderabad Metro

కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను శాలువాతో సత్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉండాలి  

ఎయిర్‌పోర్ట్‌–ఫ్యూచర్‌ సిటీ కారిడార్‌ను ఫేజ్‌–3 కింద చేపట్టండి 

ఇప్పటికే డీపీఆర్‌ సమర్పించామని వెల్లడి 

కేంద్రమంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వినతి

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–2కు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏడు కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్‌–2 సమగ్ర ప్రణాళికను రూపొందించి ఇప్పటికే డీపీఆర్‌ను సమర్పించినట్లు తెలిపారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సీఎం సమావేశమయ్యారు. హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–2, ఫేజ్‌–3పై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫేజ్‌–2, ఫేజ్‌–3 విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశంతో మెట్రో ఫేజ్‌–1ను ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ను ప్రభుత్వం స్వా«దీనం చేసుకుందని వివరించారు. ఈ నేపథ్యంలో ఫేజ్‌–2ను భారత ప్రభుత్వం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

అలాగే హైదరాబాద్‌ నగర భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్‌ – భారత్‌ ఫ్యూచర్‌ సిటీ కారిడార్‌ను మెట్రో ఫేజ్‌–3గా చేపట్టాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను కూడా ఇప్పటికే సమర్పించామని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కె.శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (పట్టణ రవాణా) ఎన్వీఎస్‌ రెడ్డి, ఢిల్లీ తెలంగాణ భవన్‌ ప్రత్యేకాధికారి సంజయ్‌కుమార్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.  

కేరళలో మోదీ, అమిత్‌షాలను ఓడించాం: సీఎం 
– వాళ్లకు ఒక్క సీటే దక్కింది 
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కేరళలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఓడించామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు స్పందించారు. ‘కేరళలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. అక్కడ రాహుల్, ప్రియాంకా గాం«దీ, మల్లికార్జున ఖర్గేలు నరేంద్ర మోదీ, అమిత్‌షాలను ఓడించారు. వాళ్లకు అక్కడ ఒక్క స్థానం మాత్రమే దక్కింది. అదీ వాళ్ల పనితీరు..’అంటూ ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement