హైదరాబాద్: విద్యాశాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించామన్నారు రేవంత్. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రసంగించారు.
‘రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలను అభివృద్ధి చేస్తున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించాం. విద్యాశాఖ పనితీరు నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకూ పేదవారికి విద్యను అందిస్తాం. ప్రైవేటు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారుచేస్తాం. విద్యాశాఖకు అంచెలంచెలుగా 15 శాతం నిధులు కేటాయిస్తాం. ప్రభుత్వ పాఠశాలలే దేశ భవిష్యత్కు వేదికలు. తెలంగాణ కల సాకారంలో విద్యార్థుల కృషి వెలకట్టలేనిది. 22వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం.’ అని రేవంత్ పేర్కొన్నారు.
విద్య మూలంగానే కుటుంబాలు ఉన్నత శిఖరాలకు..
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ.. ‘ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో బాగంగా ఈరోజు ముఖ్యమంత్రి విద్యా వారోత్సవాలు ప్రారంభించారు. అందులో భాగంగా దాదాపు 1100 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలతో పాటు ,క్యూర్ ప్రాంతంలో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ చెప్తుంటారు..విద్యార్థి సంఘ్ రాజకీయాల నుండి వచ్చిన వ్యక్తిగా అనేక సమావేశాల్లో వేదికలపై చెప్పడం జరిగింది.. ఒక వ్యక్తి అభివృద్ధి వెనుక కులం , మతం డబ్బు కారణం కాదు ,విద్య మూలంగానే కుటుంబాలు ఉన్నత శిఖరాలకు చేరుతాయి’ అని తెలిపారు.


