ఇందిరమ్మ రెండో విడతకు నేడు శ్రీకారం | CM Revanth Reddy to launch Indiramma Indlu phase 2 in Asifabad | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ రెండో విడతకు నేడు శ్రీకారం

Jun 1 2026 12:34 AM | Updated on Jun 1 2026 12:34 AM

CM Revanth Reddy to launch Indiramma Indlu phase 2 in Asifabad

కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి 

మొదటి విడతతో పోలిస్తే తగ్గిన కోటా 

రెండు విడతలు, క్యూర్‌ పరిధి ఇళ్లతో కలిపి 8 లక్షలకు చేరుకోనున్న ఇందిరమ్మ ఇళ్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రవేశపెట్టిన పేదలకు సొంటింటిని కల్పించే ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతకు శ్రీకారం చుడుతోంది. కీలక పథకమే అయినప్పటికీ, తొలివిడత కేటాయించిన ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరగటం, కేంద్రం నుంచి సకాలంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఆర్థిక సాయం అందకపోవటం వెరసి కాస్త గందరగోళంగా మారిన ఈ పథకాన్ని ఎట్టకేలకు పట్టాలెక్కించిన ప్రభుత్వం, సోమవారం రెండో విడత ఇళ్ల కేటాయింపు ప్రారంభిస్తోంది.

ఆసిఫాబాద్‌ జిల్లా కరమెర మండలం కొఠారి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా రెండో విడతను ప్రారంభిస్తున్నారు. అక్కడికి సమీపంలోని కొత్తగూడలో మొదటి విడతలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలను కూడా ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా ఇళ్ల గృహప్రవేశాలు జరగబోతున్నాయి.   

గృహ ప్రవేశానికి 1.13 లక్షల ఇళ్లు..  
గత ఏడాది ఫిబ్రవరి 3న నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ మొదటి విడత ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ విడతలో నియోజకవర్గానికి మూడున్నర వేల ఇళ్లు కేటాయించారు. ప్రభుత్వం కోటా కలుపుకొని 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. వాటిల్లో ఇప్పటికే 60 వేల ఇళ్ల గృహప్రవేశాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 1.13 లక్షల ఇళ్లు సిద్ధమయ్యాయి.

వాటి గృహప్రవేశాలు జరగబోతున్నాయి. 50 వేల మంది లబి్ధదారుల ఇళ్ల నిర్మాణం మొదలుకాలేదు. మిగతావి వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఇప్పుడు రెండో విడతకు వచ్చే సరికి ప్రభుత్వం కోటాను తగ్గించింది. జీహెచ్‌ఎంసీ–కోర్‌ పరిధి పోను మిగతా వంద నియోజకవర్గాలకు సంబంధించి రెండున్నర లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 1500 వరకు మంజూరు చేయటం విశేషం.  

పేదల ఇళ్ల రికార్డు 
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను క్యూర్‌ పరిధిలో లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దాదాపు 10 అంతస్తుల్లో ఉండే భారీ టవర్లు కూడా ఉండనున్నాయి. ఇవి కాకుండా నగరంలో సొంత జాగా ఉన్న లబ్ధిదారులకు వ్యక్తిగత ఇళ్ల­ను కూడా మంజూరు చేస్తారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కూడా ఇప్పుడే లబ్ధిదారులకు కేటాయించనున్నారు.

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరై , లబ్ధిదా­రులు పూర్తి చేసుకోలేకపోయిన నాటి ఇందిరమ్మ ఇళ్ల­కు కూడా ఇప్పుడు నిధులు మంజూరు చేయనున్నా­రు. గత ప్రభుత్వం 2023లో గృహలక్ష్మి పథకంలో మంజూరు చేసిన ఇళ్లకు కూడా నిధులు మంజూరు చేస్తారు. వెరసి మరో ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక రాష్ట్రంలో స్వల్ప సమయంలో ఇంత భారీ సంఖ్యలో పేదల కోసం ఇళ్ల నిర్మాణం జరగటం రికార్డుగా ప్రభుత్వం చెబుతోంది.

నేడు కుమురంభీం జిల్లాకు సీఎం 
రెబ్బెన: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేక హెలిక్యాప్టర్‌ ద్వారా సాయంత్రం 5:45 గంటలకు కెరమెరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడకు చేరుకుంటారు. గ్రామంలో నిర్మించిన 25 ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొని లబి్ధదారులతో మాట్లాడతారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభిస్తారు. అనంతరం 6.55 గంటలకు కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. 

జిల్లాలో రూ.112.14 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంబోత్సవాలు చేస్తారు. 8.30 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ నివాసానికి వెళ్తారు. అక్కడే భోజనం చేసి రాత్రి 10 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయల్దేరుతారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సభ ఇన్‌చార్జి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement