
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తికర వాతావరణల నెలకొంది. హైదరాబాద్లో అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్పు పై జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు జీహెచ్ఎంసీ ఆఫీసు వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ధర్నాకు దిగారు.
జీహెచ్ఎంసీ కార్యాలయానికి రెండు వైపులా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరనలు చేస్తున్నారు. ఈ నిరసనల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆఫీసులోకి బీఆర్ఎస్ కార్యకర్తలకు అనుమతి నిరాకరించడంతో వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం, ఆఫీసు గేట్లకు తాళం వేసి కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా జీహెచ్ఎంసీ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లు బైఠాయించి అన్నపూర్ణ క్యాంటీన్ ముద్దు.. ఇందిరమ్మ క్యాంటీన్ వద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శించి నినాదాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ..‘హైదరాబాద్ జంట నగరాలకు ఎంతో మంది వస్తుంటారు. అలాంటి వారికి కడుపునిండా అన్నం పెట్టాలని అన్నపూర్ణ క్యాంటీన్ల పథకం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. అన్నపూర్ణ పేరు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పేరు మార్చాలని ఉదేశ్యం ఉంటే GHMC కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది. ఆరు గ్యారెంటీలకు నచ్చిన పేరు పెట్టుకోండి.. మాకు అభ్యంతరం లేదు. అన్నపూర్ణ పేరు మార్పు మంచి పద్దతి కాదు. అన్నపూర్ణ అనగానే అమ్మవారు గుర్తు వస్తారు..

అన్నపూర్ణ పేరు మార్చాలని ప్రభుత్వానికి ఉద్దేశ్యం ఉంటే కౌన్సిల్ సమావేశంలో చర్చ పెట్టీ, ఓటింగ్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పీజేఆర్ ఫ్లై ఓవర్ ఓపెన్ చేస్తున్నారు.. మరి అది కట్టింది ఎవరు?. తిమ్మిని బమ్మిని చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. పేరు మార్పు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం’ అని హెచ్చరించారు.