
చీకటిపడితే చాలు అనేక రహదారులపై ఇవే సీన్లు
ఇటీవల టూవీలర్పై ఎనిమిది మంది ప్రయాణం
సోషల్మీడియాపై నిఘాతో పట్టుకున్న పోలీసులు
డ్రోన్లనూ వినియోగిస్తేనే పూర్తిస్థాయిలో ఫలితాలు
సాక్షి, సిటీబ్యూరో: కంచన్బాగ్–చంద్రాయణగుట్ట రోడ్డులో అర్ధరాత్రి మూడు ఆటోలు విన్యాసాలు చేశాయి. ఈ దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ఏడుగురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
బేగంపేట–ప్రకాష్ నగర్ మార్గంలో ఏడుగురు యువకులు అర్ధరాత్రి వేళ హల్చల్ చేశారు. రేసింగ్తో పాటు వీళు చేసిన ఫీట్లు సోషల్మీడియా ద్వారా పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేసిన అధికారులు ఏడుగురిని అరెస్టు చేశారు.
శంషాబాద్–రాజేంద్రనగర్ మార్గంలో ఈ–బైక్పై ప్రయాణించిన ఎనిమిది మంది రహదారిపై ఫీట్లు చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి చేసిన ఈ దుస్సాహసం దాని ద్వారానే పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు.
...ఇవన్నీ పోలీసుల రికార్డుల్లోకి ఎక్కిన స్టంట్లు. అయితే వీరి దృష్టిలో పడకుండా అనునిత్యం నగరంలోని అనేక ప్రాంతాల్లో యువత రెచ్చిపోతున్నారు. వాహనాలపై తిరుగుతూ ప్రమాదకరమైన స్టంట్లు, ఫీట్లు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. సోషల్మీడియా ప్రభావంతో రీల్స్ చేసి, లైక్స్ర్స్ పొందడానికి ఎక్కువగా చేస్తున్నారు.
ఆయా ప్రాంతాల్లో రాత్రి వేళ...
నడిరోడ్లపై సాగే ఈ సర్కస్ ఫీట్లలో పాల్గొంటున్న వారంతా యువకులే ఉంటున్నారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు రాజేంద్రనగర్, రాయదుర్గం, మాదాపూర్, బోయిన్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోయిన్పల్లి, ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించిన సరీ్వస్ రోడ్డులోని కొన్ని చోట్ల ఈ విన్యాసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి వేళల్లో సాగుతున్న వీటి వల్ల ఇతరులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు ఆ వాహనచోదకులకు, ఎదుటి వారికీ ప్రమాదహేతువులుగా మారే ప్రమాదం ఉందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితం ఉండట్లేదు.
జరిగిన తర్వాతే పట్టుకుంటున్నారు...
ఈ స్టంట్ల విషయంలో పోలీసులు అవసరమైన స్థాయిలో ‘ముందస్తు’ చర్యలు తీసుకోవట్లేదనే విమర్శ ఉంది. ఎప్పుడో అడపాదడపా మినహా ఎక్కువ సందర్భాల్లో ఫీట్లు పూర్తయిన తర్వాతే అది పోలీసుల దృష్టికి వెళ్తోంది. ఈ ఫీట్లు, స్టంట్లలో ఒకే వాహనంపై ఎక్కువ మంది ప్రయాణించడం, వెనుక చక్రంతో రోడ్డుపై రాపిడి కలిగిస్తూ పొగ వచ్చేలా చేయడం (వీలింగ్), వాహనం స్టాండ్తో పాటు ఇతర భాగాలు రోడ్డుకు తాకేలా చేసి, వేగంగా దూసుకుపోతూ నిప్పు రవ్వలు రప్పించడం (స్పార్కింగ్), ఆటోను ఓ వైపునకు ఎత్తేసి ప్రమాదకరంగా నడపటం వంటివి ఎక్కువగా జరుగున్నాయి. ఈ వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారిన తర్వాతే పోలీసుల దృష్టికి వస్తున్నాయి. దీంతో ఆయా వాహనాల నెంబర్ల ఆధారంగా ముందుకు వెళ్తున్న పోలీసులు వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటున్నారు.
డ్రోన్ల సాయంతో నిఘా ఉంచితేనే...
స్టంట్లు చేయడం పూర్తయిన తర్వాత వీడియోలు, సీసీ కెమెరాల ఆధారంగా బాధ్యుల్ని పట్టుకోవడంతో ఫలితం లేదనే వాదన వినిపిస్తోంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని, ఈ నేపథ్యంలో ఇలాంటి దుస్సాహసాలను ముందే గుర్తించి అణిచివేయాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికోసం స్టంట్లు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ సిబ్బందితో పాటు డ్రోన్ల సాయంతో నిఘా ఉంచాలని సూచిస్తున్నారు. ఇప్పటికే నగర పోలీసు విభాగం ట్రాఫిక్ నియంత్రణకు రెండు డ్రోన్లు వాడుతోంది. వీటిని రేసులు, స్టంట్ల నిరోధానికి వాడాలని కోరుతున్నారు. ఈ డ్రోన్లు గరిష్టంగా 250 మీటర్ల ఎత్తులో, 25 కిమీ పరిధిలో నిఘా ఉంచగలుగుతాయని, ‘28ఎక్స్’ వరకు జూమ్ చేసుకునే సామర్థ్యం వీటి ద్వారా స్టంట్లకు అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు తోటి ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారే ఈ తరహా రేసింగ్స్, స్టంట్స్కు సంబంధించి బాధ్యులపై బీఎన్ఎస్తో పాటు మోటారు వాహన చట్టం, సీపీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.