డబ్బుల్లేవ్‌..ఓపిక పట్టండి! | Bhatti Vikramarka to Congress MLAs On Telangana State financial situation | Sakshi
Sakshi News home page

డబ్బుల్లేవ్‌..ఓపిక పట్టండి!

Jun 1 2026 4:23 AM | Updated on Jun 1 2026 4:23 AM

Bhatti Vikramarka to Congress MLAs On Telangana State financial situation

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‘ఆర్థిక పాఠాలు’

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు..ఖర్చుకు సరిపడా రాబడి లేదు 

ఆదాయానికి, వ్యయానికి మధ్య నెలకు రూ.2,200 కోట్ల వరకు అంతరం 

కొత్త పథకాల అమలు సాధ్యం కావడం లేదు..పాతవి తీసేసే పరిస్థితి లేదు 

అదనపు ఆదాయం వచ్చే మార్గాలు కన్పించడం లేదు.. కొత్త అప్పులు తెచ్చినా ఫలితం ఉండటం లేదు.. 

పరిస్థితి ఏరోజుకారోజే అన్నట్టుంది.. మీరు కాస్త సర్దుకుపోండి 

కొద్దిగా కుదుట పడిన తర్వాత నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు 

పరిస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్న డిప్యూటీ సీఎం 

ఆదాయం పెంపునకు సూచనలు,సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు. ప్రతి నెలా అవుతున్న ఖర్చులకు ఖజానాకు వచ్చే రాబడులు సరిపోవడం లేదు. అనివార్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. అదనపు ఆదాయం వచ్చే మార్గాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కొత్త పథకాలను అమలు చేయలేకపోతున్నాం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో భాగంగా సామాజిక పింఛన్లు పెంచేందుకు ఎంత ప్రయత్నించినా నిధులు సమకూరడం లేదు. మీమీ నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం డబ్బులు ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొన్నాళ్లు సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను ముమ్మరం చేస్తాం..’ అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఆర్థిక పాఠాలు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీ ప్రజా ప్రతినిధులకు వాస్తవ పరిస్థితులను తెలియజెప్పాలనే ఆలోచనతో ఉమ్మడి జిల్లాల వారీగా ఆయన ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశమైన ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూనే, ఆదాయం పెంచుకునే మార్గాల గురించి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం.  

ప్రజలపై పన్నులు వేయకుండా నెట్టుకొస్తున్నాం.. 
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి భట్టి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరణ ఇస్తున్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వచ్చిన రాబడులు, చేసిన అప్పులు, కాంగ్రెస్‌ హయాంలో ఆదాయ, వ్యయాలను సంవత్సరాల వారీగా తెలియజేస్తున్నారు. ‘ప్రస్తుతం ప్రతి నెలా రూ.16–17 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంటే రూ.18–20వేల కోట్ల వరకు ఖర్చులవుతున్నాయి. ఆదాయం కంటే ప్రతి నెలా రూ.2,200 కోట్ల వరకు అధికంగా వ్యయమవుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త పథకాల అమలు అసాధ్యం. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై రూపాయి కూడా అదనంగా పన్ను వేయకుండా నెట్టుకొస్తున్నాం. జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, వాహనాలకు పన్నులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఇతర ఆదాయంతో సర్దుకుంటున్నాం. పాత పథకాలేవీ తీసేసే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాల అమలుకు, ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు ప్రతి నెలా నిధులిస్తున్నాం.  

పాత అప్పులే పీకల దాకా.. 
కొత్త అప్పులు తెచ్చినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. పాత అప్పులే పీకల వరకు ఉన్న నేపథ్యంలో తెచ్చిన దాని కంటే ఎక్కువగా అప్పులు కట్టాల్సి వస్తోంది. వీటికి తోడు అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులు, పరిపాలనా వ్యయం, విద్య, వైద్యం వంటి కీలక రంగాల నిర్వహణ కోసం కష్టపడాల్సి వస్తోంది. ఏరోజుకారోజు సర్దుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది మొత్తం ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఆర్థిక పరిస్థితిని దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మీమీ నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధుల కోసం కొంచెం ఓపిక పట్టండి. పరిస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించండి..’ అని భట్టి చెబుతున్నట్టు తెలిసింది. 

ఏం చేయొచ్చో చెప్పండి 
ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న మార్గాల గురించి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యేలను డిప్యూటీ సీఎం కోరుతున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న కరీంనగర్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని తెలియజేయడం మంచిదే. మేం కూడా కొన్ని సలహాలిచ్చాం. పాత పథకాలేవీ తీసేయవద్దని చెబుతూనే కొంతమేరకు క్రమబద్ధీకరించాల్సిన ఆవశ్యకతను వివరించాం. రైతు భరోసాను కుదించాలని, పింఛన్లు ప్రతి యేటా కొంత పెంచాలని, ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా లాంటి పథకాలు ప్రజల్లో మంచి పేరు తెస్తాయని, అవసరమైతే నిరుపయోగమైన ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా ఆదాయ వనరులు పెంచుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించాం. పార్టీ కార్యకర్తలు గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వాలని అడిగాం. మా నియోజకవర్గాల్లోని రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన గురించి ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. రిజి్రస్టేషన్ల రేట్లు పెంచినా పర్వాలేదని చెప్పాం. ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతే ఓట్ల కోసం వచ్చామనే భావన ప్రజల్లో కలిగించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించాం..’ అని వెల్లడించారు.     

Advertisement
 
Advertisement
Advertisement